
తిరువనంతపురం: శ్రీలంకతో చివరి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. సిరీస్ గెలిచినా జట్టులో మెరుగవ్వాల్సిన విషయాలు చాలా ఉన్నాయని తెలిపాడు. ఈ రోజు పర్ఫెక్ట్ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పాడు. జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పిన రోహిత్ శర్మ.. హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్లకు రెస్ట్ ఇచ్చామని తెలిపాడు. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగానే ఈ ఇద్దరిని పక్కనపెట్టామని రోహిత్ స్పష్టం చేశాడు. వీరి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారని పేర్కొన్నాడు.
ఇక్కడి వాతావరణం పూర్తిగా శ్రీలంకలానే ఉందని ఆ జట్టు కెప్టెన్ డసన్ షనక తెలిపాడు. తాము మంచి ఆరంభాలను అందుకున్నా.. బ్యాట్స్మెన్ వైఫల్యం సిరీస్ ఓటమికి కారణమైందని చెప్పాడు. బ్యాటింగ్ విభాగంలో మెరుగవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పిన షనక.. అషెన్ బండారా, జెఫ్రీ వండర్సే జట్టులోకి వచ్చారని తెలిపాడు.
గత రెండు వన్డేల్లోనూ టీమ్ఇండియా విభిన్న పరిస్థితులను ఎదుర్కొంది. తొలి మ్యాచ్లో బ్యాటింగ్లో చెలరేగి అలవోకగా గెలిచిన జట్టు.. రెండో వన్డేలో తడబడి, కష్టపడి నెగ్గింది. అయితే గత మ్యాచ్లో బౌలర్లు సత్తాచాటడం జట్టుకు కలిసొచ్చే అంశం. అదే జోరులో ఇప్పుడు మూడో వన్డేలోనూ ప్రత్యర్థిని చిత్తుచేయాలని చూస్తోంది. మరోవైపు కనీసం ఈ మ్యాచ్లో విజయంతోనైనా సిరీస్ను గౌరవప్రదంగా ముగించాలనే ధ్యేయంతో లంక ఉంది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.
శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, నువనిందు ఫెర్నాండో, కుశాల్ మెండిస్, అషెన్ బండార, చరిత్ అసలంక, డసనన్ షనక, వానిందు హసరంగ, జాఫ్రె వండర్సే, కసున్ రజిత, లాహిరు కుమారా.