
దుబాయ్: ఆసియాకప్ 2022లో భాగంగా భారత్ X శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్ సందర్భంగా రోహిత్ శర్మ కొట్టిన భారీ సిక్సర్కు గ్రౌండ్ సెక్యూరిటీ ముడ్డి పగిలింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా అసితా ఫెర్నాండో వేసిన 10 ఓవర్లో ఈ ఘటన చేసుకుంది.
ఈ ఓవర్ తొలి బంతిని రోహిత్ శర్మ డీప్ బ్యాక్వార్డ్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. రోహిత్ ధాటికి బౌండరీ లైన్ బయట పడిన బంతి.. అక్కడే ఉన్న సెక్యూరిటీకి బలంగా తాకింది. అతను తన సహచర సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడుతుండటంతో బంతిని గమనించలేదు. అయితే అతనికి పెద్ద గాయం కాకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 72)కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టాప్-2 బ్యాటర్లు విఫలమైన వేళ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అతనికి అండగా సూర్యకుమార్ యాదవ్(29 బంతుల్లో ఫోర్, సిక్సర్తో 34) ఒక్కడే రాణించాడు. మరోసారి మిడిలార్డర్ బ్యాటర్లు పంత్(17), హార్దిక్ పాండ్యా(17), దీపక్ హుడా(3) విఫలమయ్యారు. చివర్లో రవిచంద్రన్ అశ్విన్(15 నాటౌట్) విలువైన పరుగులతో జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. లంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక మూడు వికెట్లు తీయగా.. చమిక కరుణరత్నే, డసన్ షనక చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మహీశ్ తీక్షణ ఓ వికెట్ తీసాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండీస్ శుభారంభం అందించారు. భారీ బౌండరీలతో విరుచుకుపడిన ఈ జోడీ పవర్ ప్లేలో 60 పరుగులు చేసింది.