
బెంగళూరు: శ్రీలంకతో జరుగుతున్న డే/నైట్ టెస్ట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిన భారీ సిక్సర్కు స్టాండ్స్లో కూర్చొన్న ఓ అభిమాని తీవ్రంగా గాయపడ్డాడు. తొలి రోజు ఆటలో భాగంగా భారత ఇన్నింగ్స్ సందర్భంగా ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్ 6వ ఓవర్లో విశ్వ ఫెర్నాండో వేసిన షార్ట్ పిచ్ బాల్కు రోహిత్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. అది కాస్త గ్యాలరీలో ఉన్న ప్రేక్షకుడి ముక్కుకు బలంగా తాకింది. దాంతో అతనికి తీవ్ర గాయమై రక్త స్రావమైంది. వెంటనే స్పందించిన మైదాన భద్రతా సిబ్బంది అతనికి ప్రాథమిక చికిత్స చేసి సమీప ఆసుపత్రికి తరలించారు.
డాక్టర్లు వైద్య పరీక్షలు చేయగా.. నాసికా ఎముక ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అయితే చికిత్స అనంతరం అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ట్వీట్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ కేవలం 15 పరుగుల మాత్రమే చేసి క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ చాలా కష్టంగా మారిన పరిస్థితుల్లో తొలి రోజు బ్యాట్తో, బంతితో భారత్ సత్తా చాటింది. శ్రేయస్ అయ్యర్ (98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 92) మేటి ఇన్నింగ్స్ ఆడటంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 252 పరుగులు చేసింది. లంక బౌలర్లలో ఎంబుల్దేనియా (3/94), జయవిక్రమ (3/81), ధనంజయ డిసిల్వా (2/32) రాణించారు.
అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులే చేసింది. ఇక ఈ ఓవర్నైట్ స్కోర్ రెండో రోజు ఆటను కొనసాగించిన ఆ జట్టు 35 బంతుల్లోనే మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయి 109 పరుగులకే కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా(5/24) ఐదు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు. దాంతో భారత్కు 143 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 17 ఓవర్లలో వికెట్ నష్టపోయి 59 పరుగులు చేసింది. మరోసారి మయాంక్ అగర్వాల్(22) నిరాశపర్చగా.. రోహిత్ శర్మ(29 బ్యాటింగ్), హనుమ విహారి(7 బ్యాటింగ్) నిలకడగా ఆడుతున్నారు.
సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్ 252 ఆలౌట్ (శ్రేయస్ అయ్యర్ 92)
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 109 ఆలౌట్ ( మాథ్యూస్ 43, బుమ్రా 5/24)
భారత్ రెండో ఇన్నింగ్స్ 17 ఓవర్లలో 59/1