మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్తో జరుగుతున్న చివరి వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక అన్నాడు.
'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. పిచ్ గత రెండు వన్డేల మాదిరే ఉండనుంది. జట్టులో ఒక మార్పు చేశాం. అకిలా ధనుంజయ స్థానంలో తీక్షణ వచ్చాడు. ఈ సిరీస్లో ఇప్పటి వరకు మా కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ప్రస్తుతం మేం మెరుగైన స్థితిలో ఉన్నాం. ఈ వికెట్పై మా వాళ్లు ఎవరైనా 100 చేస్తే చూడాలని ఉంది.'అని అసలంక చెప్పుకొచ్చాడు.

మరోవైపు ఈ సవాల్ను స్వీకరిస్తున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. 'ఇప్పటికే ఈ వికెట్పై చాలా ఆడాం. గత రెండు మ్యాచ్ల్లో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాం. బ్యాట్, బంతితో మేం చేయాలనేదానిపై మాకు స్పష్టత ఉంది. మా తప్పిదాలను మేం గుర్తించాం. మా విజయానికి కావాల్సింది ఏంటో తెలుసుకున్నాం.
ప్రత్యర్థి అద్భుత ప్రదర్శన కనబర్చినప్పుడు వారికి క్రెడిట్ ఇవ్వాలి. వాళ్లు మా కంటే మెరుగైన ప్రదర్శన చేశారు. జట్టులో రెండు మార్పులు చేశాం. కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్ స్థానాల్లో రిషభ్ పంత్, రియాన్ పరాగ్ వచ్చారు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మూడు వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్ టై కాగా.. రెండో మ్యాచ్లో శ్రీలంక 32 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తాజా మ్యాచ్లో ఆ జట్టు విజయం సాధిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఓడితే మాత్రం సమం అవుతోంది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(కీపర్), శ్రేయస్ అయ్యర్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్
శ్రీలంక: పాతుమ్ నిస్సంక, అవిష్కా ఫెర్నాండో, కుశాల్ మెండీస్(కీపర్), సదీర విక్రమా, చరిత్ అసలంక, జనిత్ లియాంగే, కామిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహీష్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసితా ఫెర్నాండో.