భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య రెండో వన్డే సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ ఒకే తప్పును రిపీట్ చేయడంతో సహనం కోల్పోయిన హిట్ మ్యాన్.. ముందుకు పరుగెత్తుకొచ్చి కొడతానని హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
అసలేం జరిగిందంటే..?
శ్రీలంక బ్యాటింగ్ సందర్భంగా వాషింగ్టన్ సుందర్ వేసిన 33వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని వేసే ముందు వాషింగ్టన్ సుందర్ రెండు సార్లు రనప్ మిస్సయ్యాడు. తొలిసారి రనప్ లెంగ్త్ మిస్సవ్వడంతో బంతి వేయకుండా ఆగిపోయాడు. రెండో సారి స్లిప్ అయ్యి కిందపడిపోయాడు. అప్పటికే ఇలా మూడు సార్లు చేయడంతో రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు.

ఇంకోసారి ఇలా చేస్తే కొడతానని నవ్వుతూ బెదిరించాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. తొలిసారి ఇలా చేసినప్పుడే తిట్టిన రోహిత్.. రెండో సారి చేయడంతో కొట్టేందుకు ముందుకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. రోహిత్ వార్నింగ్కు వాషింగ్టన్ సుందర్ నవ్వుకున్నాడు. స్లో ఓవర్రేట్ అవుతుందని, కెప్టెన్గా తన మ్యాచ్ ఫీజులో కోత పడుతుందనే రోహిత్ ఇలా బెదిరించాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
సుందర్ సూపరో సూపర్..
ఈ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక ఓవర్ మెయిడిన్తో పాటు 30 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన అవిష్కా ఫెర్నాండోతో పాటు కుశాల్ మెండీస్లను ఔట్ చేసి శ్రీలంకను దెబ్బతీసాడు. ఆచితూచి ఆడుతున్న కెప్టెన్ చరిత్ అసలంకను పెవిలియన్ చేర్చాడు.
భారత్ లక్ష్యం 241
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. అవిష్కా ఫెర్నాండో(62 బంతుల్లో 5 ఫోర్లతో 40), కామిందు మెండీస్(44 బంతుల్లో 4 ఫోర్లతో 40) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(3/30) మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/33) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.