టీమిండియా హెడ్ కోచ్గా ఎంపికైన గౌతమ్ గంభీర్.. శ్రీలంక పర్యటనతో తన బాధ్యతలను స్వీకరించానున్నాడు. హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టకముందే గౌతమ్ గంభీర్ మొండివైఖరిపై విమర్శలు వస్తున్నాయి. భారత ఆటగాళ్లతో అతను ఎలా వ్యవహరిస్తాడా? అనేది చర్చనీయంశంగా మారింది. హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించకముందే గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు అందర్నీ విస్మయపరుస్తున్నాయి.
ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్ల పట్ల అతను ప్రవర్తిస్తున్న తీరు ఆందోళనకు గురిచేస్తోంది. హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టేముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నుంచి గంభీర్ అదనపు అధికారాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతను జట్టు ఎంపికలో అధిక జోక్యం చేసుకుంటన్నట్లు అర్థమవుతోంది.

ఇప్పటికే టీ20 ఫార్మాట్లో రోహిత్ శర్మ వారసుడిగా సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాను ఆటగాడిగానే కొనసాగించాలని గంభీర్ నిర్ణయించినట్లు నేషనల్ మీడియా కోడై కూస్తోంది. శ్రీలంక పర్యటనలో టీమిండియా మూడు టీ20లతో పాటు మూడు వన్డేలు ఆడనుంది. ఈ పర్యటన నుంచి రోహిత శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినివ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు.
ఎందుకంటే ఈ పర్యటన అనంతరం భారత జట్టు హోమ్ సీజన్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉండదు. అయితే శ్రీలంకతో వన్డే సిరీస్కు సీనియర్ ఆటగాళ్లంతా అందుబాటులో ఉండాలని గంభీర్.. సెలెక్టర్లను కోరినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా హోమ్ సీజన్కు ముందు అతను ఎన్సీఏ వేదికగా ప్రాక్టీస్ క్యాంప్ నిర్వహించాలనుకుంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
అంతేకాకుండా సీనియర్ ఆటగాళ్లంతా దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ దులీప్ ట్రోఫీ ఆడాలని గంభీర్.. సెలెక్టర్లకు సూచించినట్లు తెలుస్తోంది. గంభీర్ మొండి వైఖరితో సీనియర్ ఆటగాళ్లలో గందరగోళం నెలకొంది. శ్రీలంక పర్యటనకు అందుబాటులో ఉండమని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ఇద్దరూ విదేశాల్లో తమ కుబుంబ సభ్యులతో గడుపుతున్నారు. గంభీర్ బాధ్యతలు చేపట్టే ముందే అతని ఆదేశాలను సీనియర్ ఆటగాళ్లు బేఖాతరు చేయడం చర్చనీయాంశమైంది. గంభీర్.. మరో అనిల్ కుంబ్లేలా ఆటగాళ్లను ఇబ్బంది పెడుతాడా? అనే చర్చ జోరుగా సాగుతోంది.