టీమిండియా యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమయ్యాడు. మూడు టీ20ల సిరీస్లో శ్రీలంకతో శనివారం జరిగిన తొలి టీ20లో బ్యాటింగ్లో విఫలమైన రియాన్ పరాగ్.. బౌలింగ్లో అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. 8 బంతులను మాత్రమే బౌలింగ్ చేసిన రియాన్ పరాగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ మూడు వికెట్లను క్లీన్ బౌల్డ్ ద్వారా సాధించడం విశేషం.
17వ ఓవర్లో బంతిని అందుకున్న రియాన్ పరాగ్.. కామిందు మెండిస్(12)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో రియాన్ పరాగ్కు ఇదే తొలి వికెట్. దాంతో అతను కాస్త దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. గట్టిగా అరుస్తూ.. బ్యాటర్ను దూషించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

రియాన్ పరాగ్ సంబరాలపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ వికెట్ తీసినప్పుడు ఆ మాత్రం సంబరాలు చేసుకోవడం సాధారణమేనని కొందరు ఫ్యాన్స్ అంటుంటే.. అంత అత్యుత్సాహం పనికిరాదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. బ్యాటర్ను దూషించడం ఏ మాత్రం సమంజసం కాదని, రియాన్ పరాగ్ చాలా ఓవరాక్షన్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.
మళ్లీ ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసిన రియాన్ పరాగ్.. తొలి రెండు బంతుల్లో మహీష్ తీక్షణ(2), దిల్షాన్ మదుషంక(0)లను క్లీన్ బౌల్డ్ చేశాడు. నేడు జరిగే రెండో టీ20లో అతను వేసే తొలి బంతికి వికెట్ తీస్తే హ్యాట్రిక్ ఘనత రియన్ పరాగ్కు దక్కుతుంది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చేసే సామర్థ్యం ఉందనే రియాన్ పరాగ్ను తుది జట్టులోకి తీసుకున్నారు. అతని కోసం స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్, శివమ్ దూబేలను కూడా బెంచ్పై కూర్చోబెట్టారు.
ఈ మ్యాచ్లో భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు టీ20ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. రిషభ్ పంత్(33 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 49), యశస్వి జైస్వాల్(21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 40), శుభ్మన్ గిల్(16 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 34) ధాటిగా ఆడారు.
శ్రీలంక బౌలర్లలో మతీష పతీరణ(4/40) నాలుగు వికెట్లు తీయగా.. దిల్షాన్ మదుషంక, అసిత ఫెర్నాండో, వానిందు హసరంగా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 170 పరుగులకు ఆలౌటై చిత్తుగా ఓడింది. పాతుమ్ నిస్సంక(48 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 79), కుశాల్ మెండీస్(27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 45) రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
14 ఓవర్లలో 140/1 స్కోర్ పటిష్టంగా కనిపించిన ఆ జట్టు తర్వాతి 32 బంతుల్లో 30 పరుగులే చేసి 9 వికెట్లు కోల్పోయి 170 పరుగులకు ఆలౌటై చిత్తుగా ఓడింది. భారత బౌలర్లలో రియాన్ పరాగ్(3/5) మూడు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్ తలో వికెట్ తీసారు.