
శుభారంభం దక్కినా..
టెస్ట్ల్లో తొలిసారి కెప్టెన్సీ చేస్తున్న రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టుకు దూరమైన సీనియర్లు అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాల స్థానాల్లో తెలుగు క్రికెటర్ హనుమ విహారీ, శ్రేయస్ అయ్యర్లకు అవకాశమిచ్చిన రోహిత్.. ఎక్స్ట్రా స్పిన్నర్ జయంత్ యాదవ్తో బరిలోకి దిగాడు. మయాంక్ అగర్వాల్తో ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ మంచి శుభారంభాన్ని అందించాడు. ఆరంభంలో కొంత సమయం తీసుకున్నా.. ఆ తర్వాత ఈ ఇద్దరూ ధాటిగా ఆడారు. ఇక రోహిత్ శర్మ(28) బలహీనతపై దెబ్బ కొడుతూ లాహిరి కుమార ఫలితాన్ని రాబట్టాడు. టెంప్టింగ్ షాట్ పిచ్ బంతితో హిట్ మ్యాన్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కొద్దిసేపటికే మయాంక్(33) సైతం ఎల్బీగా వెనుదిరిగడంతో భారత్ 80 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.

నిరాశ పరిచిన కోహ్లీ..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హనుమ విహారీ, విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడారు. ప్రత్యర్థి బౌలర్లను గౌరవిస్తూ వీలు చిక్కిన బంతిని బౌండరీలకు తరలించాడు. ఈ క్రమంలోనే కోహ్లీ తనదైన కవర్ డ్రైవ్స్ షాట్స్తో అలరించాడు. ఇక క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని లసిత్ ఎంబుల్దెనియా విడదీసాడు. సూపర్ బాల్తో కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 90 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విహారి కూడా ఫెర్నాండో బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు.

పంత్ సూపర్ ఇన్నింగ్స్..
క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆచితూచిగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. వీలుచిక్కిన బంతిని మాత్రమే బౌండరీకి తరలిస్తూ క్విక్ సింగిల్స్, డబుల్స్తో స్ట్రైక్ రొటేట్ చేశారు. ఇక క్రీజులో కుదురుకున్న ఈ జోడీని డిసిల్వా విడదీసాడు. శ్రేయస్ అయ్యర్(27)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 53 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత జడేజాతో కలిసి రిషభ్ పంత్ చెలరేగాడు.

8 బంతుల్లో 32..
73 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్లతో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎంతలా అంటే అతను ఆడిన చివరి 8 బంతుల్లో ఏకంగా 32 పరుగులు చేశాడు. ఈ విధ్వంసంతో పంత్ సెంచరీ పక్కా అని అంతా భావించారు. కానీ సురంగ లక్మల్.. ఈ భారత వికెట్ కీపర్ జోరుకు కళ్లెం వేసాడు. సూపర్బ్ డెలివరీతో పంత్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో రిషభ్ పంత్ తీవ్ర నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్తో జడేజా మరో వికెట్ పడకుండా తొలి రోజు ఆటను ముగించారు.


Click it and Unblock the Notifications
