శ్రీలంక పర్యటనలో టీమిండియా ఆఖరి పోరుకు సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం కొలంబో వేదికగా చివరి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ టై కాగా.. రెండో వన్డేలో శ్రీలంక 32 పరుగుల తేడాతో భారత్ను ఓడించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆఖరి వన్డేలో విజయం సాధిస్తే శ్రీలంకనే సిరీస్ వరించనుంది.
మరోవైపు టీమిండియా తమ తప్పిదాలపై ఫోకస్ పెట్టింది. రెండు మ్యాచ్ల్లో భారత్ గెలవకపోవడానికి ప్రధాన కారణం. బ్యాటింగ్ వైఫల్యం. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. శ్రీలంక స్పిన్ను ఆడలేక పెవిలియన్కు క్యూ కట్టారు. రోహిత్ శర్మ మినహా మరే బ్యాటర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.

ముఖ్యంగా గౌతమ్ గంభీర్ అనాలోచిత నిర్ణయాలే టీమిండియా కొంపముంచాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం బ్యాటింగ్ ఆర్డర్లో అతను చేసిన మార్పులు తీవ్ర నష్టం చేశాయి. నాలుగు, ఐదు స్థానాల్లో రావాల్సిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లను 6, 7వ స్థానాల్లో బ్యాటింగ్కు పంపంగా వారు దారుణంగా విఫలమయ్యారు. మరోవైపు నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చిన శివమ్ దూబే, అక్షర్ పటేల్కు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. శివమ్ దూబే డకౌట్ అవ్వగా.. అక్షర్ పటేల్ పర్వాలేదనిపించాడు.
ఈ క్రమంలోనే మిడిలార్డర్ను బలోపేతం చేయడంపై గౌతమ్ గంభీర్ ఫోకస్ పెట్టాడు. కేఎల్ రాహుల్, శివమ్ దూబే స్థానాల్లో ఎడమ చేతి వాటం బ్యాటర్ అయిన రిషభ్ పంత్తో పాటు స్పిన్ సామర్థ్యం కలిగిన రియాన్ పరాగ్ను తీసుకోనున్నాడు. మూడో వన్డేలో టీమిండియా ఈ రెండు మార్పులతోనే బరిలోకి దిగనుంది.
ఈ ఇద్దరి రాకతో జట్టుకు మంచి సమతూకం వస్తుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. రియాన్ పరాగ్.. ఆరో బౌలింగ్ ఆప్షన్గా కూడా పనికివస్తాడు. మిడిలార్డర్లో నిలకడగా బ్యాటింగ్ చేయగలడు.
శ్రీలంకతో మూడో వన్డే.. భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్/కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్/శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్.