
మొహాలీ: బ్యాటింగ్లో భారీ శతకం బాదిన రవీంద్ర జడేజా(175 నాటౌట్).. బౌలింగ్లోనూ(5/41) ఐదు వికెట్లతో రఫ్ఫాడించాడు. దాంతో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా విజయం దిశగా కొనసాగుతోంది. 108/4 ఓవర్ నైట్స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన శ్రీలంక 65 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూలింది.
శ్రీలంక ఇన్నింగ్స్లో పాతుమ్ నిస్సంక(133 బంతుల్లో 11 ఫోర్లతో 61 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. చివరి నలుగురు బ్యాట్స్మన్ అయితే డకౌటవ్వడం విశేషం. జడేజా ఐదు వికెట్ల ప్రదర్శనకు తోడు రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. షమీకి ఓ వికెట్ దక్కింది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా 574/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. దాంతో టీమిండియాకు 400 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఈ నేపథ్యంలో శ్రీలంక ఫాలో ఆన్ ఆడుతుంది.
మూడో రోజు ఆటను ప్రారంభించిన ఓవర్నైట్ బ్యాట్స్ పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక ఆరంభంలో ఆచితూచి ఆడారు. వీలు చిక్కిన బంతి బౌండరీకి తరలించారు. బౌండరీలతో జోరు కనబర్చిన పాతుమ్ నిస్సంక.. అశ్విన్ బౌలింగ్లో క్విక్ సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ అసంలక కూడా బౌండరీలతో జోరు కనబర్చాడు. అయితే అతని జోరుకు జస్ప్రీత్ బుమ్రా కళ్లెం వేసాడు. ఎల్బీగా పెవిలియన్ చేర్చి.. శ్రీలంక పతనాన్ని మొదలుపెట్టాడు.
ఆ తర్వాత రవీంద్ర జడేజా రంగంలోకి దిగగా.. క్రీజులోకి వచ్చి డిక్ వెల్లా(2), సురంగ లక్మల్(0)లను ఒకే ఓవర్లలో పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీశాడు. ఆ వెంటనే లసిత్ ఎంబుల్దెనియా(0)ను షమీ సూపర్ బౌన్సర్తో బోల్తా కొట్టించాడు. ఇక తన మరుసటి ఓవర్లో జడేజా వరుస బంతుల్లో విశ్వ ఫెర్నాండో(0), లాహిరు కుమార(0)లను ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. టీమిండియాకు భారీ ఆధిక్యం లభించడంతో కెప్టెన్ రోహిత్ శర్మ.. శ్రీలంకను ఫాలో ఆన్కు ఆహ్వానించాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకకు మళ్లీ ఆదిలోనే షాక్ తగిలింది. అశ్విన్ బౌలింగ్లో ఓపెనర్ లాహిరు తిరుమన్నే(0) డకౌట్గా వెనుదిరిగాడు.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్ 574/8 డిక్లేర్డ్ (రవీంద్ర జడేజా 175 నాటౌట్, రిషభ్ పంత్ 95)
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 174 ఆలౌట్ (పాతుమ్ నిస్సంక 61 నాటౌట్, జడేజా 5/41)