
మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్లో భారీ శతకంతో చెలరేగిన రవీంద్ర జడేజా(228 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్లతో 175 నాటౌట్) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఏడో స్థానంలో అత్యధిక వ్యక్తిగత పరుగు చేసిన తొలి భారత బ్యాట్స్మన్గా రవీంద్ర జడేజా చరిత్రకెక్కాడు. తద్వారా 35 ఏళ్ల రికార్డును అధిగమించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు భారత దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉండగా.. తాజాగా రవీంద్ర జడేజా సవరించాడు. 1986లో ఇదే శ్రీలంకపై కాన్పూర్ వేదికగా జరిగిన నాటి మ్యాచ్లో కపిల్ దేవ్ ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 163 పరుగులు చేశాడు.
ఈ జాబితాలో రిషభ్ పంత్(156) మూడో స్థానంలో ఉండగా.. పోలీ ఉమ్రిగర్(132), సందీప్ పాటిల్(129) తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా రిషభ్ పంత్ ఏడో స్థానంలో వచ్చి 156 పరుగులు చేశాడు. గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు దూరమైన జడేజా..రీఎంట్రీలో ఆడుతున్న తొలి మ్యాచ్లోనే సెంచరీ సాధించడం విశేషం. ఏడో స్ధానంలో వచ్చి అద్భుతమైన సెంచరీ సాధించిన జడేజాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అద్భుతమైన ఆల్రౌండర్ అంటూ క్రికెట్ దిగ్గజాలు జడేజాను కొనియాడుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ తొలి ఇన్నింగ్స్ను 572/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా అజేయ శతకానికి తోడు రవిచంద్రన్ అశ్విన్(82 బంతుల్లో 8 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్కు 130 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించగా.. మహమ్మద్ షమీ(20 నాటౌట్)తో కలిసి జడేజా 9వ వికెట్కు 103 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఇక తొలి రోజు ఆటలో రిషభ్ పంత్(97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 96) ధనాధన్ ఇన్నింగ్స్తో తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. హనుమ విహారీ(58) హాఫ్ సెంచరీతో మెరిసాడు.