
దుబాయ్: ఆసియాకప్ 2022 లీగ్ దశలో వరుస విజయాలతో దుమ్మురేపిన టీమిండియా.. అసలు సిసలు సూపర్-4లో చేతులెత్తేసింది. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడి ఫైనల్ ఆశలను గల్లంతు చేసుకుంది. మంగళవారం శ్రీలంకతో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా జరిగిన డూఆర్డై మ్యాచ్లో సమష్టిగా విఫలమైన టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. రెండు మ్యాచ్ల్లో టాస్ ఓడిపోవడం టీమిండియా కొంపముంచగా.. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం కూడా విజయవకాశాలను దెబ్బతీసింది.
శ్రీలంకతో మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 72) హాఫ్ సెంచరీతో చెలరేగగా... అతనికి అండగా సూర్యకుమార్ యాదవ్(29 బంతుల్లో ఫోర్, సిక్సర్తో 34) రాణించాడు. మరోసారి మిడిలార్డర్ బ్యాటర్లు పంత్(17), హార్దిక్ పాండ్యా(17), దీపక్ హుడా(3) విఫలమవ్వగా.. చివర్లో రవిచంద్రన్ అశ్విన్(15 నాటౌట్) విలువైన పరుగులతో జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. లంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక మూడు వికెట్లు తీయగా.. చమిక కరుణరత్నే, డసన్ షనక చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మహీశ్ తీక్షణ ఓ వికెట్ తీసాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 174పరుగుల చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్లు పాతుమ్ నిస్సంక(37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 52), కుశాల్ మెండిస్ (37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీలతో రాణించగా.. భానుక రాజపక్స( 16 బంతుల్లో 2 సిక్సర్లతో 24 నాటౌట్), డసన్ షనక(17 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్తో 33 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ మూడు వికెట్లు తీయగా.. అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు.