కొలంబో: ఆసియా కప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేసారు. లంక స్పిన్నర్లు దునిత్ వెల్లలాగే(5/40), చరిత్ అసలంక (4/14) చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 47 ఓవర్లలో 9 వికెట్లకు 197 పరుగులు చేసింది. వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపివేసారు.
భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్(61 బంతుల్లో ఫోర్, సిక్స్తో 33), కేఎల్ రాహుల్(44 బంతుల్లో 2 ఫోర్లతో 39) పర్వాలేదనిపించారు. క్రీజులో అక్షర్ పటేల్(15 బ్యాటింగ్)తో పాటు సిరాజ్(2 బ్యాటింగ్) ఉన్నాడు.

ఓపెనర్ల శుభారంభం..
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(19) అద్భుత ఆరంభాన్ని అందించారు. శ్రీలంక పేసర్లపై ఈ జోడీ ఎదురు దాడికి దిగడంతో భారత స్కోర్ బోర్డు పరుగెత్తింది. కాసున రజితా వేసిన ఏడో ఓవర్ ఐదో బంతిని రోహిత్ భారీ సిక్సర్గా మలిచి వన్డేల్లో 10 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.
అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న రెండో బ్యాటర్గా నిలిచాడు. డసన్ షనక వేసిన 10వ ఓవర్లో నాలుగు బౌండరీలు బాది 17 పరుగులు పిండుకున్నాడు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే శ్రీలంక కెప్టెన్ డసన్ షనక.. స్పిన్నర్లను రంగంలోకి దించి ఫలితాన్ని రాబట్టాడు.

చెలరేగిన వెల్లలాగే
దునిత్ వెల్లలాగే సాయంతో శుభ్మన్ గిల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. గిల్ ఔటైనా.. పతీరణ బౌలింగ్లో బౌండరీ బాదిన రోహిత్ 49 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ టోర్నీలో రోహిత్ శర్మకు ఇది హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ కావడం విశేషం.
రోహిత్ హాఫ్ సెంచరీ బాదిన వెల్లలాగే తన జోరు కొనసాగించాడు. వరుస ఓవర్లలో విరాట్ కోహ్లీ(3)తో పాటు రోహిత్ శర్మను పెవిలియన్కు చేర్చాడు. విరాట్ కోహ్లీని క్యాచ్ ఔట్ చేసిన వెల్లలాగే.. రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో టీమిండియా 11 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. 63 పరుగులతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని వెల్లలాగేనే విడదీసాడు.
పర్ఫెక్ట్ ప్లాన్తో బౌలింగ్ చేసి క్యాచ్ ఔట్ చేశాడు. వెల్లలాగే ఉచ్చును గ్రహించలేకపోయిన రాహుల్ మూల్యం చెల్లించుకున్నాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్(39)ను చరిత్ అసలంక ఔట్ చేయగా.. హార్దిక్ పాండ్యా(5)ను వెల్లలాగే పెవిలియన్ చేర్చి 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఆసియాకప్లో భారత్పై ఐదు వికెట్ల ఘనత అందుకున్న రెండో బౌలర్గా వెల్లలాగే చరిత్రకెక్కాడు.
క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా(4), జస్ప్రీత్ బుమ్రా(5), కుల్దీప్ యాదవ్(0)లను చరిత్ అసలంక ఔట్ చేయగా.. సిరాజ్తో కలిసి అక్షర్ పటేల్ మరో వికెట్ పడకుండా ఆటను ముగించే ప్రయత్నం చేశారు. కానీ వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లను ఆటను నిలిపివేసారు.