
పుణే: శ్రీలంకతో రెండో టీ20లో టీమిండియా అరంగేట్ర ప్లేయర్ రాహుల్ త్రిపాఠి సూపర్ ఫీల్డింగ్తో ఆకట్టుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద మైమరిపించే ఫీల్డింగ్తో ఔరా అనిపించాడు. వెనక్కి పరుగెత్తుతూ.. అసాధారణ క్యాచ్ అందుకున్నాడు. దాంతో సిక్సర్ కాస్త క్యాచ్ ఔట్గా మారగా.. శ్రీలంక బ్యాటర్ పాతుమ్ నిస్సంక(35 బంతుల్లో 4 ఫోర్లతో 33) బిత్తరపోయాడు. ప్రస్తుతం ఈ క్యాచ్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్గా మారాయి.
శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా అక్షర్ పటేల్ వేసిన 12వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని అక్షర్ షార్ట్గా వేయగా.. బ్యాక్ ఫుట్లో భారీ షాట్ ఆడాడు. డీప్ మిడ్ వికెట్గా బంతి గాల్లో దూసుకెళ్లింది. సిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ వెనక్కి పరుగెత్తుతూ అద్భుతంగా అందుకున్నాడు. క్యాచ్ అందుకున్న తర్వాత బౌండరీ లైన్ తొక్కకుండా సమన్వయం చేసుకున్నాడు. దాంతో సిక్సర్ కాస్త ఔట్గా మారింది. సంజూ శాంసన్ గాయంతో జట్టుకు దూరమవడంతో అవకాశం అందుకున్న రాహుల్ త్రిపాఠి... ఫీల్డింగ్లో మాత్రం సత్తా చాటాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. భారత బౌలర్ల తప్పిదాలను క్యాష్ చేసుకున్న శ్రీలంక ఓపెనర్లు పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండీస్(52) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. దాంతో లంక పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని యుజ్వేంద్ర చాహల్ విడదీసాడు. కుశాల్ మెండీస్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.
దాంతో తొలి వికెట్కు నమోదైన 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్సను ఉమ్రాన్ మాలిక్.. క్లీన్ బౌల్డ్ చేశాడు. రాహుల్ త్రిపాఠి స్టన్నింగ్ క్యాచ్కు పాతుమ్ నిస్సంక ఔటవ్వగా.. ధనంజయ డిసిల్వా(3)ను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. ధాటిగా ఆడిన చరిత్ అసలంక(37), వానిందు హసరంగాలను ఉమ్రాన్ మాలిక్ వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు.