ఈ నెలాఖరులో శ్రీలంక పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. అక్కడ ఆతిథ్య శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లు ఆడనుంది. ఇప్పటికే ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది.
ఈ నెల 26 నుంచి మూడు టీ20ల సిరీస్, ఆగస్ట్ 1 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 మ్యాచ్లు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుండగా.. వన్డే మ్యాచ్లు మధ్యాహ్నం 2.30కు మొదలవ్వనున్నాయి. ఈ పర్యటనతో టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. తన బాధ్యతలను స్వీకరించనున్నాడు.

టీ20 ప్రపంచకప్ తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా..అక్కడ ఐదు టీ20ల సిరీస్ ఆడింది. ప్రపంచకప్ విజేతలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించగా శుభ్మన్ గిల్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టు 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. అయితే శ్రీలంక పర్యటనకు భారత ప్రధాన ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది.
టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సీనియర్లంతా అందుబాటులో ఉండాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పర్యటనకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు జస్ప్రీత్ బుమ్రా కూడా దూరంగా ఉండనున్నారు. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రాకు రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రోహిత్, విరాట్ కోహ్లీలు కూడా ఈ పర్యటనకు దూరంగా ఉండనున్నారని టీమ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ జాబితాలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా చేరినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో శ్రీలంక పర్యటనలోని వన్డే సిరీస్కు దూరంగా ఉంటానని బీసీసీఐని కోరినట్లు వార్తలు వచ్చాయి. అందుకు బీసీసీఐ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.
'వ్యక్తిగత కారణాలతోనే హార్దిక్ పాండ్యా వన్డే సిరీస్కు దూరంగా ఉండనున్నాడు. అతనికి ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవు. హార్దిక్ గాయపడ్డాడనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు.'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరమైన నేపథ్యంలో టీమిండియాకు సారథ్యం వహించేది ఎవరా? అనేది చర్చనీయాంశమైంది.
రోహిత్, హార్దిక్ గైర్హాజరీలతో భారత జట్టును కేఎల్ రాహుల్ లేదా శుభ్మన్ గిల్ నడిపించే అవకాశం ఉంది. గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో రాహుల్ టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించాడు. శుభ్మన్ గిల్.. ఇటీవల ముగిసిన జింబాబ్వే పర్యటనలో సారథిగా 4-1తో సిరీస్ అందించాడు. శుభ్మన్ గిల్కు వన్డే ఫార్మాట్లో సారథిగా వ్యవహరించిన అనుభవం లేదు. టీ20 సిరీస్లో హార్దిక్ పాండ్యా బదులు సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్ చేస్తారనే ప్రచారం జోరు అందుకుంది.