
కోల్కతా: శ్రీలంకతో రెండో వన్డేలోనూ టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. తొలి వన్డేలో అద్భుత బౌలింగ్తో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్.. రెండో వన్డేలోనూ జట్టుకు శుభారంభం అందించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన లంకను సూపర్ బౌలింగ్తో దెబ్బకొట్టాడు. వరుసగా ఔట్ స్వింగర్, ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్తో బ్యాటర్ మైండ్ బ్లాంక్ చేసిన సిరాజ్.. సెన్సేషన్ స్వింగర్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఈ వికెట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
అసలేం జరిగిందంటే.. శ్రీలంక ఇన్నింగ్స్ 6వ ఓవర్లో సిరాజ్.. ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో(20)ను పెవిలియన్ చేర్చాడు. లంక ఓపెనర్ కదలికలకు తగ్గట్లు ప్లాన్ చేసి ఉచ్చు బిగించిన సిరాజ్.. తనకే సాధ్యమైన ఇన్స్వింగర్తో మిడిల్ వికెట్ లేపేసాడు. సిరాజ్ వేసిన ఇన్ స్వింగర్ అర్థం కాక అవిష్కా ఫెర్నాండో బిత్తరపోయాడు. రెప్పపాటు క్షణంలో లోపలికి దూసుకొచ్చిన బంతి మిడిల్ వికెట్ను లేపేసింది. వరుసగా ఐదు బంతులను ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేసిన సిరాజ్.. చివరి బంతిని మాత్రం సూపర్ స్వింగర్తో ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు.
సిరాజ్ తీసిన ఈ వికెట్ సూపరో సూపర్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. గత కొన్నాళ్లు సిరాజ్ అసాధారణమైన బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడని, అతని బౌలింగ్ వేరియేషన్స్ కూడా చాలా మారాయని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండీస్(24 బ్యాటింగ్)తో మరో ఓపెనర్ నువనిందు ఫెర్నాండో(34 బ్యాటింగ్) ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ ఇద్దరూ నిలకడగా ఆడటంతో పవర్ ప్లేలో శ్రీలంక 51 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్కు టీమిండియా ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. యుజ్వేంద్ర చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. తొలి వన్డేలో డైవ్ చేసినప్పుడు చాహల్కు గాయమైందని, దాంతో అతన్ని పక్కనపెట్టాల్సి వచ్చిందని టాస్ సందర్భంగా రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.