IND vs SL, World Cup 2023: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శ్రీలంకతో గురువార జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లతో సత్తా చాటిన మహమ్మద్ షమీ(5/18).. భారత విజయంలో కీలక పాత్ర పోషించడంతో పాటు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
వన్డే ప్రపంచకప్ చరిత్రలో మహమ్మద్ షమీ ఇప్పటి వరకు 45 వికెట్లు తీసాడు. జహీర్ ఖాన్ 23 మ్యాచ్ల్లో 44 వికెట్లతో టాప్లో ఉండగా.. తాజాగా షమీ అతన్ని అధిగమించాడు. 14 మ్యాచ్ల్లోనే అతను ఈ ఫీట్ సాధించడం విశేషం. ఈ జాబితాలో షమీ, జహీర్ ఖాన్ తర్వాత జవగళ్ శ్రీనాథ్(34 మ్యాచ్ల్లో 44 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా(16 మ్యాచ్ల్లో 33), అనిల్ కుంబ్లే(18 మ్యాచ్ల్లో 31), కపిల్ దేవ్(26 మ్యాచ్ల్లో 28) ఉన్నారు.

తాజా ప్రపంచకప్లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్లే ఆడిన షమీ.. 14 వికెట్లతో సత్తా చాటాడు. ఈ మూడు మ్యాచ్ల్లో రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకోవడం విశేషం. న్యూజిలాండ్తో మ్యాచ్లో తుది జట్టులోకి వచ్చిన షమీ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. బంగ్లాదేశ్తో 4 వికెట్లు సాధించిన షమీ.. తాజా మ్యాచ్లో 5 వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు.
దాంతో ప్రపంచకప్ చరిత్రలో అత్యధికసార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి భారత బౌలర్గా షమీ చరిత్రకెక్కాడు. షమీ ఇప్పటి వరకు 3 సార్లు ఐదు వికెట్ల ఫీట్ సాధించాడు.
శ్రీలంకతో మ్యాచ్లో 10వ ఓవర్లో బౌలింగ్ వచ్చిన షమీ.. వరుస బంతుల్లో చరిత్ అసలంక(1), దుషాన్ హేమంత(0)లను పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్లో దుష్మంత్ చమీరా(0)ను ఔట్ చేసిన షమీ.. అనంతరం ఏంజెలో మాథ్యూస్(12)ను క్లీన్ బౌల్డ్ చేయడంతో పాటు కాసున్ రజితా(14)ను ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లతో 92), విరాట్ కోహ్లీ(94 బంతుల్లో 11 ఫోర్లతో 88), శ్రేయస్ అయ్యర్(56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లతో 82) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. శ్రీలంక బౌలర్లలో మధుషంక(5/82) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. దుష్మంత్ చమీరాకు ఓ వికెట్ దక్కింది.
అనంతరం శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్కు తోడుగా జస్ప్రీత్ బుమ్రా(1/8), రవీంద్ర జడేజా(1/4) రాణించారు. ఈ గెలుపుతో టీమిండియా అధికారికంగా సెమీస్కు చేరింది.