
ధర్మశాల: మూడు టీ20లు, రెండు టెస్ట్ల సిరీస్ల కోసం భారత పర్యటనకు వచ్చిన శ్రీలంకకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే లక్నో వేదికగా గురువారం జరిగిన ఫస్ట్ టీ20లో 62 పరుగులతో చిత్తుగా ఓడిన లంక.. సిరీస్లో గెలవాలంటే తప్పక గెలవాల్సిన రెండో టీ20కి ముందు స్లార్ ప్లేయర్ల సేవలను కోల్పోయింది. ఫస్ట్ టీ20లో తొడ కండరాల గాయానికి గురైన మిస్టరీ స్పిన్నర్ మహీశ్ తీక్షణ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అంతేకాకుండా లెగ్ స్పిన్నర్ కుశాల్ మెండీస్ ఆడటంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. అతను కూడా హార్మ్స్ట్రింగ్ నిగిల్తో బాధపడుతున్నాడు.
అయితే రెండు టెస్ట్ల సిరీస్ వరకు అతను కోలుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి సేవలను కోల్పోయిన నేపథ్యంలో టెస్ట్ టీమ్లో ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా, ధనుంజయ డిసిల్వాలను శ్రీలంక క్రికెట్ బోర్డు టీ20 జట్టులోకి చేర్చింది. యువ పేసర్ షిరన్ ఫెర్నాండో సైతం గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇక భారత పర్యటనకు ముందే శ్రీలంక టాప్ స్పిన్నర్ వానిందు హసరంగాకు కరోనా వైరస్ సోకడంతో అతను ఈ పర్యటనకు దూరమయ్యాడు. దాంతో శ్రీలంక జట్టు పరిస్థితి ఆగోమ్యగోచరంగా తయారైంది.
తొలి టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' ఇషాన్ కిషన్ (56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 89) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 57 నాటౌట్), రోహిత్ శర్మ (32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 44) మెరుపులు మెరిపించారు. అనంతరం శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చరిత్ అసలంక (47 బంతుల్లో 5 ఫోర్లతో 53 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్, వెంకటేశ్ అయ్యర్ రెండేసి వికెట్లు తీయగా.. జడేజా, చాహల్ చెరొక వికెట్ పడగొట్టారు.