కొలంబో: టీమిండియా చైనా మన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో (4/43) నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ వన్డేల్లో 150 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత స్పిన్ బౌలర్గా చరిత్రకెక్కాడు.
తద్వారా భారత మాజీ పేసర్, ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో మహమ్మద్ షమీ అగ్రస్థానంలో ఉన్నాడు. షమీ 80 మ్యాచ్ల్లోనే 150 వికెట్ల ఘనతను అందుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 88 మ్యాచ్ల్లో ఈ ఫీట్ సాధించగా.. అజిత్ అగార్కర్(97), జహీర్ ఖాన్(103), అనిల్ కుంబ్లే(106), ఇర్ఫాన్ పఠాన్(106) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఓవరాల్గా అత్యంత వేగాంగా ఈ ఫీట్ సాధించిన స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగో స్థానంలో నిలిచాడు. సక్లెయిన్ ముస్తాక్ 78 మ్యాచ్ల్లో ఈ ఫీట్ సాధించి అగ్రస్థానంలో ఉండగా.. రషీద్ ఖాన్(80), అజంత మెండీస్(84), కుల్దీప్ యాదవ్ కన్నా ముందున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు కుప్పకూలింది. రోహిత్ శర్మ(48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్(61 బంతుల్లో ఫోర్, సిక్స్తో 33), కేఎల్ రాహుల్(44 బంతుల్లో 2 ఫోర్లతో 39) పర్వాలేదనిపించారు. చివర్లో అక్షర్ పటేల్(26, సిరాజ్(5 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.
లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే(5/40) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. చరిత్ అసలంక (4/14) నాలుగు వికెట్లు తీసాడు. మహీశ్ తీక్షణకు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. ధనంజయ డిసిల్వా( 66 బంతుల్లో 5 ఫోర్లతో 41), దునిత్ వెల్లలాగే(46 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 42 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/43) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాకు తలో వికెట్ దక్కింది.