శ్రీలంకతో మూడు వన్డే సిరీస్లో టీమిండియా వైఫల్యం కొనసాగుతోంది. సునాయసంగా గెలవాల్సిన తొలి వన్డేను చేజేతులా టై చేసుకున్న రోహిత్ సేన.. రెండో వన్డేలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో పేలవ బ్యాటింగ్తో టీమిండియా 32 పరుగుల తేడాతో చిత్తయ్యింది.
ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్లో శ్రీలంక 1-0తో ఆధిక్యంలో నిలిచింది. శ్రీలంక స్పిన్నర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ముఖ్యంగా శివమ్ దూబే, కేఎల్ రాహుల్ డకౌట్గా వెనుదిరగడం టీమిండియా బ్యాటింగ్ పతనానికి కారణమైంది. ఇతర బ్యాటర్లపై అనవసర ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు కాసేపు క్రీజులో నిల్చున్నా ఫలితం మరోలా ఉండేది.

రాణించిన మెండీస్, ఫెర్నాండో..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. అవిష్కా ఫెర్నాండో(62 బంతుల్లో 5 ఫోర్లతో 40), కామిందు మెండీస్(44 బంతుల్లో 4 ఫోర్లతో 40) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(3/30) మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/33) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 42.2 ఓవర్లలో 208 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ శర్మ(44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 64) హాఫ్ సెంచరీతో రాణించగా.. శుభ్మన్ గిల్(44 బంతుల్లో 3 ఫోర్లతో 35), అక్షర్ పటేల్(44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 44) కీలక ఇన్నింగ్స్ ఆడారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో జెఫ్రె వండర్సే(6/31) 6 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. చరిత్ అసలంక(3/19) మూడు వికెట్లు పడగొట్టాడు.
రోహిత్ దూకుడు..
241 పరుగుల సాధారణ లక్ష్య చేధనకు దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఓవైపు శుభ్మన్ గిల్ నిదానంగా ఆడినా మరోవైపు రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అతను 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో తొలి పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది.
హాఫ్ సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడిన రోహిత్.. సెంచరీ దిశగా సాగాడు. వండర్సే బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 97 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
దెబ్బతీసిన వండర్సే..
వండర్సే తన వరుస ఓవర్లలో శుభ్మన్ గిల్(35), శివమ్ దూబే(0), విరాట్ కోహ్లీ(14), శ్రేయస్ అయ్యర్(7), కేఎల్ రాహుల్(0)లను పెవిలియన్ చేర్చాడు. దాంతో 147 పరుగులకే టీమిండియా 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో అక్షర్ పటేల్.. వాషింగ్టన్ సుందర్(15) సాయంతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ఇద్దర్నీ అసలంక ఔట్ చేశాడు. దాంతో భారత్ ఓటమి ఖాయమైంది.