IND vs SL, World Cup 2023: వన్డే ప్రపంచకప్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో భారత పేసర్లు దుమ్మురేపుతున్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ నిప్పులు చెరగడంతో శ్రీలంక 14 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. భారత పేసర్లు వికెట్లు తీయడంలో పోటీ పడటంతో శ్రీలంక బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు. భారత పేసర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు 0, 0, 1, 0, 1, 0, 0 పరుగులే చేసి వెనుదిరిగారు.
358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు తొలి బంతికే జస్ప్రీత్ బుమ్రా దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఓపెనర్ పాతుమ్ నిస్సంక(0)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఈ నిర్ణయాన్ని పాతుమ్ నిస్సంక సవాల్ చేయగా.. రివ్యూలో అంపైర్స్ కాల్ అని తేలింది. దాంతో నిస్సంక గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు.

ఈ వికెట్తో బుమ్రా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలి బంతికి వికెట్ తీసిన తొలి భారత బౌలర్గా చరిత్రకెక్కాడు. మరుసటి రెండు బంతులను బుమ్రా వైడ్ వేయడంతో ఖాతా తెరిచిన శ్రీలంక.. సిరాజ్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికి మరో వికెట్ కోల్పోయింది.
సిరాజ్ స్వింగ్ బాల్కు దిముత్ కరుణరత్నే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ నిర్ణయాన్ని అతను సవాల్ చేసినా ఫలితం లేకుండా పోయింది. క్రీజులోకి వచ్చిన సమరవిక్రమాను ఇదే ఓవర్ ఐదో బంతికి సిరాజ్ స్లిప్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. మెయిడిన్ ఓవర్తో పాటు రెండు వికెట్లు తీసిన సిరాజ్.. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్ను గుర్తు చేశాడు. ఆ మ్యాచ్లో సిరాజ్ 6 వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు.
సిరాజ్ దెబ్బకు 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక పూర్తిగా డిఫెన్స్కే పరిమితమైంది. దాంతో జస్ప్రీత్ బుమ్రా వేసిన మూడో ఓవర్లో సింగిల్ మాత్రమే వచ్చింది. నాలుగో ఓవర్ వేసిన సిరాజ్.. తొలి బంతికే మెండీస్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో శ్రీలంక 3 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి ఏంజేలో మాథ్యూస్ తొలి బౌండరీ బాదాడు. చరిత్ అసలంకతో కలిసి అతను డిఫెన్స్కే పరిమితమయ్యాడు. దాంతో శ్రీలంక స్కోర్ బోర్డు నత్తనడకన సాగింది. 9వ ఓవర్లో మహమ్మద్ షమీని రంగంలోకి దించిన రోహిత్ శర్మ ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు.
షమీ వేసిన 10వ ఓవర్లో వరుస బంతుల్లో చరిత్ అసలంక(1), దుషాన్ హేమంత(0) పెవిలియన్ చేరారు. ఈ ఇద్దరూ క్యాచ్ ఔట్గా వెనుదిరిగారు. దాంతో ఈ ఓవర్ కూడా మెయిడిన్ అయ్యింది. భారత పేసర్ల ధాటికి శ్రీలంక పవర్ ప్లేలోనే 6 వికెట్లు కోల్పోయి 14 పరుగులే చేసింది. షమీ వేసిన మరుసటి ఓవర్లో దుష్మంత్ చమీరా(0) కూడా పెవిలియన్ చేరాడు. ఫీల్డ్ అంపైర్ ఔటివ్వకపోయినా.. రివ్యూ ద్వారా టీమిండియా వికెట్ సాధించింది.