5 వికెట్లు.. 8వసారి...
ఓవర్నైట్ బ్యాట్స్మన్ లసిత్ ఎంబుల్దెనియా(1)ను షార్ట్ పిచ్ బాల్తో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చిన బుమ్రా.. ఆ తర్వాత క్రీజులో సెట్ అయిన నిరోషన్ డిక్వెల్లా(38 బంతుల్లో 3 ఫోర్లతో 21) కీపర్ క్యాచ్గా వెనక్కిపంపాడు. దాంతో ఐదు వికెట్ల ఘనతను పూర్తి చేసుకున్న బుమ్రాకు కెరీర్లో ఇది 8వ ఐదు వికెట్ల హాల్ కావడం విశేషం. ఇక భారత గడ్డపై మాత్రం ఇదే తొలిసారి. 10 ఓవర్లలోనే బుమ్రా ఈ ఘనతను అందుకోవడం మరో విశేషం. ఇందులో 4 ఓవర్లు మెయిడిన్ చేసిన బుమ్రా కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆసక్తికరమైన విషయం ఏంటే దిగ్గజ పేసర్ కపిల్ దేవ్ బుమ్రాలానే తన 29వ టెస్ట్ల్లోనే 8 సార్లు 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు.
బుమ్రా ట్రిపుల్ సెంచరీ..
ఈ ఐదు వికెట్ల ప్రదర్శన ద్వారా బుమ్రా.. అంతర్జాతీయ క్రికెట్లో 300 వికెట్ల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. తాజా ప్రదర్శనతో కలిసి టెస్ట్ల్లో ఇప్పటి వరకు 120 వికెట్లు తీసిన బుమ్రా.. వన్డేల్లో 113, టీ20ల్లో 67 వికెట్లు తీసాడు. శ్రీలంక జట్టుపై భారత పేసర్లలో బుమ్రా( 5/24)దే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. భారత వైస్ కెప్టెన్గా ఈ ఘనతను అందుకున్న తొలి భారత బౌలర్ కూడా బుమ్రానే.
భారత్కు భారీ ఆధిక్యం..
బుమ్రాకు తోడుగా రవిచంద్రన్ అశ్విన్.. సురంగా లక్మల్(5), విశ్వఫెర్నాండో(8)లను ఔట్ చేయడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకే కుప్పకూలింది. దాంతో భారత్కు 143 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. బ్యాటింగ్ చాలా కష్టంగా మారిన పరిస్థితుల్లో తొలి రోజు బ్యాట్తో, బంతితో భారత్ సత్తా చాటింది. శ్రేయస్ అయ్యర్ (98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 92) మేటి ఇన్నింగ్స్ ఆడటంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 252 పరుగులు చేసింది. లంక బౌలర్లలో ఎంబుల్దేనియా (3/94), జయవిక్రమ (3/81), ధనంజయ డిసిల్వా (2/32) రాణించారు.ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడుతోంది.

సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్ 252 ఆలౌట్ (శ్రేయస్ అయ్యర్ 92)
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 109 ఆలౌట్ ( మాథ్యూస్ 43, బుమ్రా 5/24)
భారత్ రెండో ఇన్నింగ్స్ 7 ఓవర్లలో 21/0


Click it and Unblock the Notifications
