
లక్నో: టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో గురువారం జరిగిన తొలి టీ20 హాఫ్ సెంచరీతో చెలరేగిన ఇషాన్(56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 89).. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు రిషభ్ పంత్ రికార్డును అధిగమించాడు. టీ20ల్లో వికెట్ కీపర్గా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రిషభ్ పంత్( 65), కేఎల్ రాహుల్ (57), ధోనీ (56) ఇషాన్ కిషన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
2017లో బెంగళూరు వేదికగా ఇంగ్లండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో ధోనీ 56 పరుగులు చేసి వికెట్ కీపర్గా ఒక మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవగా.. ఆ రికార్డును రిషభ్ పంత్ అధిగమించాడు. 2019లో వెస్టిండీస్పై 42 బంతుల్లో 65 పరుగులతో ధోనిని వెన్కక్కినెట్టాడు. తాజాగా ఇషాన్ కిషన్ ధోనీ, పంత్లను భారీ మార్జిన్తో అధిగమించి తొలి స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించాడు.
శ్రీలంకతో టీ20 సిరీస్కు రిషభ్ పంత్కు విశ్రాంతినివ్వగా, కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. తొలి మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మెుదటి వికెట్కు 111 పరుగుల భాగస్వామ్యాన్ని ఇషాన్ కిషన్ నెలకొల్పాడు . రోహిత్ (32 బంతుల్లో 44) పర్వాలేదనిపించాడు. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీస్కోరు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' ఇషాన్ కిషన్ (56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 89) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 57 నాటౌట్), రోహిత్ శర్మ (32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 44) మెరుపులు మెరిపించారు. అనంతరం శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చరిత్ అసలంక (47 బంతుల్లో 5 ఫోర్లతో 53 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్, వెంకటేశ్ అయ్యర్ రెండేసి వికెట్లు తీయగా.. జడేజా, చాహల్ చెరొక వికెట్ పడగొట్టారు.