టీమిండియా టీ20 ప్రపంచకప్ విజయంతో హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగిసింది. దాంతో గౌతమ్ గంభీర్ను బీసీసీఐ ద్రవిడ్కు వారసుడిగా ఎంపిక చేసింది. ద్రవిడ్తో పాటు అతని సపోర్ట్ స్టాఫ్లోని బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్లు కూడా తప్పుకున్నారు.
ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ కాంట్రాక్ట్ను మాత్రం పొడిగించారు. దిలీప్ను కొనసాగించేందుకు ఒప్పుకున్న గంభీర్.. అసిస్టెంట్ కోచ్లుగా టీమిండియా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్, నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ ర్యాన్ టెన్ డస్చేట్ను నియమించుకున్నాడు. బౌలింగ్ కోచ్గా మోర్నీ మోర్కెల్ కోసం పట్టుబడుతున్నాడు. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోంది.

అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డస్చేట్లు ఐపీఎల్లో కేకేఆర్కు అసిస్టింట్ కోచ్లుగా వ్యవహరించారు. యువ ఆటగాళ్లను తయారు చేయడంలో అభిషేక్ నాయర్ కీలక పాత్ర పోషించాడు. దాంతో గంభీర్ అతని పేరు సూచించగానే అసిస్టెంట్ కోచ్గా బీసీసీఐ నియమించింది. అయితే మరో అసిస్టెంట్ కోచ్గా ర్యాన్ టెన్ డస్చేట్ను నియమించడంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఓ విదేశీ ఆటగాడిని కోచ్గా ఎలా నియమిస్తారు? అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. గతంలో టీమిండియాకు హెడ్ కోచ్గా వ్యవహరించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రేగ్ ఛాపెల్ జట్టుకు తీవ్ర నష్టం చేశాడు. ఆటగాళ్ల మధ్య చిచ్చు పెట్టి అనవసర వివాదాలకు కారణమయ్యాడు. దాంతో విదేశీ కోచ్లను నియమించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.
స్వదేశీ ఆటగాళ్లకే కోచ్లుగా నియమించుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. అనిల్ కుంబ్లే, రవి శాస్త్రి హెడ్ కోచ్లుగా ఉన్న సమయంలో అసిస్టెంట్లుగా ఒక్క విదేశీ ఆటగాడికి అవకాశం ఇవ్వలేదు. కానీ గంభీర్ మాత్రం సహాయ కోచ్గా ర్యాన్ టెన్ను నియమించుకోవడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. నెదర్లాండ్స్కు చెందిన ర్యాన్ టెన్తో గంభీర్కు మంచి స్నేహం ఉంది.
కేకేఆర్కు అతను సారథిగా ఉన్న సమయంలో ర్యాన్ టెన్ ఆటగాడిగా జట్టులో ఉన్నాడు. పసికూన నెదర్లాండ్స్ జట్టులో స్టార్ క్రికెటర్గా ఎదిగేందుకు ర్యాన్ టెన్ ఎంతో కష్టపడ్డాడు. అతని ప్రయత్నాలకు ముగ్దుడైన గంభీర్.. కేకేఆర్ ప్లేయర్గా, సపోర్ట్ స్టాఫ్ మెంబర్గా అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా టీమిండియాలోకి తీసుకున్నాడు.
గంభీర్ నిర్ణయానికి నో చెప్పలేక బీసీసీఐ కూడా ర్యాన్ టెన్ను అసిస్టెంట్ కోచ్గా నియమించింది.అయితే ర్యాన్ టెన్ను కోచ్గా తీసుకొని గంభీర్ తప్పు చేశాడని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు.