మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్తో జరుగుతున్న ఆఖరి వన్డేలో శ్రీలంక పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. అరంగేట్ర ప్లేయర్ రియాన్ పరాగ్(3/54) సంచలన బౌలింగ్తో శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేశాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు చేసింది.
శ్రీలంక బ్యాటర్లలో అవిష్కా ఫెర్నాండో(102 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 96) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. కుశాల్ మెండీస్(82 బంతుల్లో 4 ఫోర్లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఓపెనర్ పాతుమ్ నిస్సంక(65 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు వికెట్లు తీయగా. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్లు తలో వికెట్ తీసారు.

టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు పాతుమ్ నిస్సంక, అవిష్కా ఫెర్నాండో అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. పిచ్కు తగ్గట్లు ఆచితూచి ఆడిన ఈ జోడీ తొలి వికెట్కు 89 పరుగులు జోడించింది. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీసాడు. పాతుమ్ నిస్సంకను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు.
అనంతరం కుశాల్ మెండీస్తో కలిసి సెంచరీకి చేరువైన అవిష్కా ఫెర్నాండోను రియాన్ పరాగ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇదే జోరులో కెప్టెన్ చరిత్ అసలంక(10) ఔట్ చేసిన పరాగ్.. శ్రీలంకకు వరుస షాక్లు ఇచ్చాడు. సదీర విక్రమా(0)ను సిరాజ్ గోల్డెన్ డక్ చేయగా.. జనిత్ లియనగే(8)ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశాడు.
దునిత్ వెల్లలాగే(2)ను రియాన్ పరాగ్ బోల్తా కొట్టించగా.. ఆచితూచి ఆడిన కుశాల్ మెండీస్ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. దాంతో భారీ స్కోర్ చేస్తుందనుకున్న లంక సాధారణ స్కోర్కే పరిమితమైంది.