IND vs SL: తొలి టీ20కి వర్ష గండం! మనీశ్ పాండే ఔట్.. ఆ ఇద్దరికీ చాన్స్! తుది జట్లు ఇవే!

కొలంబో: శ్రీలంక గడ్డపై మూడు వన్డేల సిరీస్ 2-1తో కైవసం చేసుకున్న భారత్.. ఇప్పుడు మూడు టీ20ల సిరీస్ కోసం సిద్దమైంది. ఆదివారం రాత్రి ప్రారంభమయ్యే తొలి టీ20లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. టీ20 ప్రపంచకప్ ముందు జరుగుతున్న సిరీస్ కావడంతో ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. మెగా ఈవెంట్కు ముందు టీమిండియా పలు ప్రశ్నలకు సమాధానం కనుక్కొనే ప్రయత్నం చేయనుంది. ఇప్పటికే ఆటగాళ్లను ఆడించే విషయంలో కోహ్లీ, రవిశాస్త్రి చెప్పినట్లు నడుచుకుంటామని కెప్టెన్ శిఖర్ ధావన్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఈ మూడు టీ20ల సిరీస్ కుర్రాళ్ల సత్తాకు పరీక్షగా నిలవనుంది. మరోవైపు ఆఖరి వన్డే విజయంతో ఆత్మవిశ్వాసం సాధించిన లంక ఈ సిరీస్నైన గెలిచి ప్రతీకారం తీసుకోవాలని భావిస్తోంది.

పకడ్బందీగా టీమిండియా..
ఆఖరి వన్డేలో 6 మార్పులు చేసి మూల్యం చెల్లించుకున్న భారత్.. ఫస్ట్ టీ20లో పకడ్బందీగా బరిలోకి దిగనుంది. ఈ పర్యటనలో ఆడే అవకాశం దక్కంది వరుణ్ చక్రవర్తీ, రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్ మాత్రమే. అయితే ఈ మ్యాచ్లో వరుణ్కు చోటు దక్కే అవకాశాలున్నా.. పడిక్కల్, గైక్వాడ్ మరికొన్ని రోజులు నిరీక్షించాల్సిందే. ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా బరిలోకి దిగనున్నారు. వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ జట్టులోకి రానుండగా.. మూడు వన్డేల సిరీస్లో దారుణంగా విఫలమైన మనీశ్ పాండే స్థానంలో సంజూ శాంసన్కు అవకాశం దక్కనుంది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు చోటు ఖాయం. కృనాల్ ప్లేస్లో గౌతమ్ను ఆడించే అవకాశాలు లేకపోలేదు. ప్రధాన పేసర్లుగా దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ జట్టులోకి తిరిగిరానున్నారు. వరుణ్ చక్రవర్తీ అంతర్జాతీయ అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. ఇక యుజ్వేంద్ర చాహల్ను ఆడిస్తారా? లేక రాహుల్ చాహర్కు అవకాశమిస్తారా? అనేది చూడాలి.

విజయ ఉత్సాహంలో శ్రీలంక..
తొలి రెండు వన్డేల్లో ఓడిన శ్రీలంక.. ఆఖరి మ్యాచ్లో మాత్రం అదరగొట్టింది. సొంతగడ్డపై భారత్ చేతిలో 10 ఓటముల తర్వాత గెలుపొందింది. ఈ విజయంతో రెట్టించిన ఉత్సాహంలో తొలి టీ20 బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్కు దూరమైన హసరంగా ఈ మ్యాచ్లో ఆడే అవకాశాలున్నాయి. హసరంగా జట్టులోకి వస్తే జయవిక్రమార్క్ బెంచ్కు పరిమితం కానున్నాడు. టీ20 స్పెషలిస్ట్ అయిన ఇసురు ఉడానాకు కూడా చోటు దక్కే అవకాశాలున్నాయి. మూడో వన్డేలో ఆల్రౌండ్ షో కనబర్చిన ఆ జట్టు తొలి టీ20లోనూ అదే తరహాలో రాణించాల్సి ఉంది.

పిచ్ రిపోర్ట్:
మూడు వన్డేలు ఇక్కడే జరగడంతో పిచ్ కొంచెం స్లోగా మారింది. పవర్ ప్లే రూల్స్ను ఉపయోగించుకుంటూ కొత్త బంతితోనే బ్యాట్స్మన్ పరుగులు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మిడిల్ ఓవర్లలో వికెట్పై టర్న్ లభిస్తుండటంతో స్పిన్నర్లు చెలరేగనున్నారు. బ్యాట్, బంతి మధ్య ఆసక్తికర పోరు నడవనుంది. దాంతో టాస్ గెలిచిన జట్లు ఫీల్డింగ్కే మొగ్గు చూపవచ్చు. ఈ వికెట్పై 160 పరుగులే మంచి స్కోర్. ఇక ఆదివారం సాయంత్రం వర్షం పడే అవకాశం ఉంది. మ్యాచ్కు అంతరాయం కలగవచ్చు. రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

తుది జట్లు: (అంచనా)
భారత్: పృథ్వీ షా, శిఖర్ ధావన్(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా/కృష్ణప్ప గౌతమ్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తీ, యుజ్వేంద్ర చాహల్/రాహుల్ చాహర్
శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక(కీపర్), భానుక రాజపక్స, ధనుంజయ డి సిల్వా, చరిత అసలంక, డసన్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, వానిందు హసరంగ/ ప్రవీణ్ జయవిక్రమార్క, ఇసురు ఉడానా, దుష్మంత చమీరా, అకిలా ధనుంజయ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications