కొలంబో: వన్డే క్రికెట్లో టీమిండియా చెత్త రికార్డు నమోదు చేసింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి 10 వికెట్లను స్పిన్నర్లకు సమర్పించుకుంది. ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో ఈ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. కాకతాళీయమో ఏమో కానీ ఈ టోర్నీలోనే పాకిస్థాన్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో 10 వికెట్లను పేసర్లకు సమర్పించుకుంది.
తాజాగా శ్రీలంకతో మ్యాచ్లో స్పిన్నర్ల ధాటికి కుప్పకూలింది. లంక స్పిన్నర్లు దునిత్ వెల్లలాగే(5/40), చరిత్ అసలంక (4/14), మహీశ్ తీక్షణ(1/41) చెలరేగడంతో భారత్ 213 పరుగులకు కుప్పకూలింది. స్పిన్ బౌలింగ్తో భారత్ను ఆలౌట్ చేసిన తొలి జట్టుగా శ్రీలంక చరిత్రకెక్కింది. గింగిరాలు తిరిగిన పిచ్పై భారత బ్యాటర్లు నిలబడలేకపోయారు.

80 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన టీమిండియాను వెల్లలాగే అతలాకుతలం చేశాడు. 11వ ఓవర్లో బౌలింగ్కు దిగిన అతను ముందుగా శుభ్మన్ గిల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 14వ ఓవర్లలో సెంచరీ హీరో విరాట్ కోహ్లీని క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. 16వ ఓవర్లో హాఫ్ సెంచరీతో క్రీజులో సెట్ అయిన రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు.
దాంతో 11 పరుగుల వ్యవధిలోనే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం కీలక భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఇషాన్-రాహుల్ జోడీని విడదీసాడు. కేఎల్ రాహుల్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. తద్వారా భారత టాప్-4 బ్యాటర్లను పెవిలియన్ చేర్చిన తొలి బౌలర్గా చరిత్రకెక్కాడు. ఆ కొద్దిసేపటి హార్దిక్ పాండ్యాను ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.
అతనికి తోడుగా పార్ట్టైమ్ స్పిన్నర్ చరిత్ అసలంక.. ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్లను పెవిలియన్ చేర్చాడు. అక్షర్ పటేల్ను తీక్షణ ఆఖరి వికెట్గా పెవిలియన్ చేర్చాడు.
ఈ మ్యాచ్లో భారత్ను ఆలౌట్ చేయడం ద్వారా శ్రీలంక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. వరుసగా 14వ మ్యాచ్లో ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన ఘనతను అందుకుంది. ఇక వన్డేల్లో వరుసగా 13 మ్యాచ్లు గెలిచిన రికార్డు కూడా శ్రీలంకకు ఉంది.