కొలంబో: బర్త్డే బాయ్ వానిందు హసరంగ(4/9) స్పిన్ ధాటికి భారత్ విలవిలలాడింది. అతనికి తోడుగా ఇతర బౌలర్లు కూడా రాణించడంతో శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 81 పరుగులు చేసింది. ఫలితంగా టీ20 క్రికెట్లో భారత్ మరో అత్యల్ప స్కోర్ను నమోదు చేసింది. ఇప్పటివరకు టీ20ల్లో టీమిండియా అత్యల్ప స్కోర్ 75. భారత జట్టులో కుల్దీప్ యాదవ్(28 బంతుల్లో 23 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు.
ఇక టీమిండియా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఐదుగురు శిఖర్ ధావన్(0), దేవదత్ పడిక్కల్(9), సంజూ శాంసన్(0), రుతురాజ్ గైక్వాడ్(14), నితీశ్ రాణా(6) దారుణంగా విఫలమయ్యారు. దాంతో భారత్ 36 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ పరిస్థితుల్లో భువనేశ్వర్ కుమార్(16), కుల్దీప్ యాదవ్(12) కొంత క్రీజులో నిలబడే ప్రయత్నం చేయడంతో భారత్ పరువు దక్కించుకుంది. భువీ(16) ఔటైన వెంటనే రాహుల్ చాహర్(5), వరుణ్ చక్రవర్తీ(0) వికెట్లను వెనువెంటనే కోల్పోయింది. అయితే చేతన్ సకారియాతో కలిసి కుల్దీప్ నిదానంగా ఆడటంతో భారత్ ఆలౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది.
టాస్ గెలిచిన ధావన్ బ్యాటింగ్ తీసుకోవడం పూర్తిగా మిస్ ఫైర్ అయింది. తొలి ఓవర్లోనే కెప్టెన్ శిఖర్ ధావన్ క్యాచ్ ఔట్గా వెనుదిరగ్గా.. గైక్వాడ్ రెండు ఫోర్లు, పడిక్కల్ ఒక ఫోర్తో జోరు కనబర్చారు. కానీ మెండీస్ బౌలింగ్లో పడిక్కల్ ఎల్బీగా వెనుదిరగ్గా.. ఆ తర్వాత సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగారు. ఆ తర్వాత నితీశ్ రాణా.. డసన్ షనక సూపర్ క్యాచ్తో రాణా ఔటవ్వడంతో భారత్ పతనం మొదలైంది. క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసిన భువీ డసన్ షనక సూపర్ క్యాచ్తో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ చాహర్ బౌండరీ బాది జోరు కనబర్చాడు. కానీ ఆవెంటనే అప్పర్ కట్ ఆడబోయి కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తీ కూడా క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత చేతన్ సకారియా(4)తో కుల్దీప్.. 18 పరుగులు జత చేసి భారత్కు ఆలౌటయ్యే ప్రమాదాన్ని తప్పించాడు.