
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాప్-3 వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ వన్డేలో ధనాధన్ బ్యాటింగ్తో అలరించిన ఓపెనర్ పృథ్వీ(13), వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్(1) తీవ్రంగా నిరాశపరిచారు. పృథ్వీ షాను డిసిల్వా .. ఇషాన్ కిషన్ను రజితా క్లీన్ బౌల్డ్ చేశారు. దాంతో 39 పరుగులకే భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే(31 బ్యాటింగ్)తో కెప్టెన్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. చూడచక్కని షాట్లతో రన్రేట్ తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని డిసిల్వా విడదీశాడు. జోరుమీదున్న ధావన్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో 65 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్ రాగా.. మనీష్ పాండే ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. ఈ ఇద్దరు క్రీజులో ఉండటం భారత్కు చాలా అవసరం.
అంతకుముందు అవిష్కా ఫెర్నాండో(71 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 50), చరిత్ అసలంక(68 బంతుల్లో 6 ఫోర్లతో 65) హాఫ్ సెంచరీలతో రాణించడంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 రన్స్ చేసింది. ఫెర్నాండో, చరిత్కు అండగా.. చివర్లో చమిక కరుణరత్నే(33 బంతుల్లో 5 ఫోర్లతో 44 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. మినోద్ భానుక(36), ధనుజంయ డిసిల్వా(36) కూడా పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్(3/50), భువనేశ్వర్ కుమార్(3/54) మూడేసి వికెట్లు తీయగా.. , దీపక్ చాహర్ (2/53) రెండు వికెట్లు పడగొట్టాడు.