
కోల్కతా: శ్రీలంకతో రెండో వన్డేలో టీమిండియా అద్బుత విజయాన్నందుకుంది. గురువారం జరిగిన ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్(103 బంతుల్లో 6 ఫోర్లతో 64 నాటౌట్) విరోచిత బ్యాటింగ్తో భారత్ 4 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. అయితే ఈ విజయంతో టీమిండియా ఓ అరుదైన ఘనతను అందుకుంది. వన్డే ఫార్మాట్లో ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా చరిత్రకెక్కింది. శ్రీలంకపై భారత్కు ఇది 95వ విజయం కాగా.. న్యూజిలాండ్పై ఆస్ట్రేలియా 95 వన్డేల విజయ రికార్డును సమం చేసింది.
ఈ జాబితాలో పాకిస్థాన్ తర్వాతి స్థానంలో ఉంది. శ్రీలంకపై పాకిస్థాన్ ఇప్పటి వరకు 92 విజయాలు నమోదు చేసింది. ఇక శ్రీలంకపై భారత్కు ఇది 26వ ద్వైపాక్షిక సిరీస్ విజయం కావడం గమనార్హం. ఈ ఓటమితో శ్రీలంక చెత్త రికార్డును నమోదు చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ఓటములు చవి చూసిన జట్టుగా శ్రీలంక అప్రతిష్టను మూటగట్టుకుంది. వన్డేల్లో ఇప్పటి వరకు 437 మ్యాచ్లు ఓడిన శ్రీలంక.. టీ20ల్లో 94 మ్యాచ్లు ఓడిపోయింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 39.4 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలింది. అరంగేట్ర ప్లేయర్ నువనిందు ఫెర్నాండో(50) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లకు తోడుగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు తీసాడు. అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 43.2 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసి గెలుపొందింది. కేఎల్ రాహుల్కు అండగా హార్దిక్ పాండ్యా(53 బంతుల్లో 4 ఫోర్లతో 36) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక బౌలర్లలో కరుణరత్నే, లాహిరు కుమార రెండేసి వికెట్లు తీయగా.. కసున్ రజిత, ధనంజయ డిసిల్వా చెరొక వికెట్ పడగొట్టారు.