
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆట మొదల పెట్టకుండానే వార్తల్లో నిలిచాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు సంప్రదాయం ప్రకారం ఇరు జట్ల ఆటగాళ్లు తమ జాతీయ గీతాలను ఆలపించారు. ముందుగా భారత జాగీయ గీతం రాగా... ఆ తర్వాత శ్రీలంక జాతీయ గీతం ప్లే చేశారు. దీన్ని ఆయా జట్ల ఆటగాళ్లు, కోచ్లు అనుసరిస్తూ పాడారు. అయితే హార్దిక్ పాండ్యా భారత జాతీయ గీతంతో పాటు శ్రీలంక జాతీయ గీతం పాడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ విషయాన్ని గుర్తించిన అభిమానులు దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.
ఇక శ్రీలంక జాతీయ గీతం ఆలపించిన హార్దిక్ పాండ్యాపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. హార్దిక్ పాండ్యా ట్రూ మ్యూజిక్ లవర్ అని ఒకరంటే.. శ్రీలంక నమో నమో మాతా జాతీయ గీతానికి పాండ్యా ఫిదా అయ్యుంటాడని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు శ్రీలంక పట్ల తన ఉదారతను చాటుకుంటున్నాడని, ఈ మ్యాచ్లో రాణించేదేముండదని ట్వీట్ చేస్తున్నారు. ప్రత్యర్థిని గౌరవించడం అంటే ఇదేనని కూడా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట చర్చనీయాంశమైంది.
ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా ఊహించనట్లుగానే ఈ మ్యాచ్ ద్వారా భారత యువ ఆటగాళ్లు పృథ్వీ షా, వరుణ్ చక్రవర్తీ అంతర్జాతీయ టీ20 క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. మనీశ్ పాండేపై వేటు పడగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఇద్దరికీ అవకాశం దక్కింది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ పృథ్వీ షా గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. దుష్మంత్ చమీరా వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే కీపర్ క్యాచ్గా ఔటయ్యాడు. దాంతో భారత్ ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్(27)తో శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 51 పరుగుల భాగస్వామ్యం అనంతరం హసరంగా బౌలింగ్లో సంజూ శాంసన్ ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం సూర్య కుమార్ యాదవ్ తనదైన స్టైల్ బ్యాటింగ్ చేయడంతో భారత స్కోర్ బోర్డు పరుగెత్తింది. 13 ఓవర్లలో 2 వికెట్లకు భారత్ 105 పరుగులు చేసింది.