
కోల్కతా: శ్రీలంకతో రెండో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహనం కోల్పోయాడు. వాటర్ ఇవ్వలేదని 12వ ఆటగాడైన వాషింగ్టన్ సుందర్పై నోరుపారేసుకున్నాడు. నీళ్లు ఇవ్వకుండా ఎవని ** *****? (G**nd Mara Rahe Ho Udhar)అని బూతు పదాలను వాడాడు. ఈ కామెంట్స్ కాస్త స్టంప్ మైక్లో రికార్డు అవ్వడంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. హార్దిక్ పాండ్యా ఉపయోగించిన పదజాలంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది మంది చూస్తారనే ఇంగిత జ్ఞానం లేకుండా హార్దిక్ పాండ్యా వ్యవహరించాడని మండిపడుతున్నారు. సహచర ఆటగాడిపై కనీస గౌరవం లేకుంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు.
నీళ్ల కోసం అంత పెద్ద మాట వాడాలా? అని హార్దిక్ పాండ్యాను విమర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో హార్దిక్ పాండ్యా హద్దులు ధాటి ప్రవర్తిస్తున్నాడని, 8 మ్యాచ్లకు కెప్టెన్సీ చేయడం, వైస్ కెప్టెన్గా ప్రమోషన్ రావడంతో బలుపు ఎక్కువైందని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడని, ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్లోనూ ఇలానే వ్యవహరించాడని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా హార్దిక్ తన ప్రవర్తనను మార్చుకోవాలని, ఎంత పెద్ద ఆటగాడైన కనీస మర్యాద లేకుండా ప్రవర్తించడం సరికాదని సూచిస్తున్నారు.
శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. 11 ఓవర్ పూర్తయిన అనంతరం సుందర్ వాటర్ తీసుకురాకపోవడంతో అక్కడ ఏం చేస్తున్నావ్ నీళ్లు ఇవ్వకుండా అని హిందీలో తిట్టాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 39.4 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలింది. అరంగేట్ర ప్లేయర్ నువనిందు ఫెర్నాండో(50) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లకు తోడుగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు తీసాడు. అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 43.2 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసి 4 వికెట్లతో గెలుపొందింది. కేఎల్ రాహుల్(103 బంతుల్లో 6 ఫోర్లతో 64 నాటౌట్) అండగా హార్దిక్ పాండ్యా(53 బంతుల్లో 4 ఫోర్లతో 36) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక బౌలర్లలో కరుణరత్నే, లాహిరు కుమార రెండేసి వికెట్లు తీయగా.. కసున్ రజిత, ధనంజయ డిసిల్వా చెరొక వికెట్ పడగొట్టారు.