టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ తన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో శనివారం జరిగిన తొలి టీ20లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ సిరీస్కు ముందే సూర్య కెప్టెన్గా.. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా నియమితులైన విషయం తెలిసిందే. మరోవైపు టీ20 ప్రపంచకప్ విజయానంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. దాంతో భారత టీ20 క్రికెట్లో ఓ కొత్త శకం మొదలైంది.
గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా అటాకింగ్ అప్రోచ్తో ఆడుతోంది. శ్రీలంకతో తొలి మ్యాచ్లో భారత బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్మన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్కు 36 బంతుల్లో 74 పరుగులు జోడించారు. ఫస్ట్ డౌన్లో బరిలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్ తన ట్రేడ్ మార్క్ బ్యాటింగ్తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గంభీర్.. రెండో వేగవంతమైన ఫిఫ్టీ నమోదు చేశాడు.

సూర్య హాఫ్ సెంచరీ సాధించడంతో గంభీర్ థ్రిల్లయ్యాడు. సంతోషంగా చప్పట్లతో సూర్యను అభినందించాడు. ప్రస్తుతం గంభీర్కు సంబంధించిన రియాక్షన్ నెట్టింట వైరల్గా మారింది.
సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగులు చేసింది.
రిషభ్ పంత్(33 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 49), యశస్వి జైస్వాల్(21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 40), శుభ్మన్ గిల్(16 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 34) ధాటిగా ఆడారు. శ్రీలంక బౌలర్లలో మతీష పతీరణ(4/40) నాలుగు వికెట్లు తీయగా.. దిల్షాన్ మదుషంక, అసిత ఫెర్నాండో, వానిందు హసరంగా తలో వికెట్ తీసారు.