టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించాడు. శ్రీలంక పర్యటనతో హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ తొలి సిరీస్లోనే విజయాన్ని అందుకున్నాడు. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
శని, ఆదివారాల్లో జరిగిన రెండు టీ20ల్లో టీమిండియా విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్ల్లో కోచ్గా గంభీర్ తన మార్క్ను చూపించాడు. ముఖ్యంగా తుది జట్టు ఎంపికలో తనదైన నిర్ణయాలతో ఆకట్టుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ను కాకుండా యువ స్పిన్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ను తీసుకొని తన ప్రణాళికలు ఏంటో స్పష్టంగా తెలియజేశాడు.

మరో యువరాజ్ సింగ్..
టీమిండియాకు మరో యువరాజ్ సింగ్ను సిద్దం చేయాలనే లక్ష్యంతోనే గంభీర్.. ఈ పర్యటనకు రియాన్ పరాగ్ను ఎంపిక చేశాడు. జింబాబ్వే పర్యటనలో విఫలమైన రియాన్ పరాగ్ను శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్లకు తీసుకోవడంపై సర్వాత్రా విమర్శలు వచ్చాయి. కానీ శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్తోనే రియాన్ పరాగ్ విషయంలో గంభీర్ చేసింది సరైన నిర్ణయమనే విషయం స్పష్టమైంది.
టీమిండియా టాపార్డర్ బ్యాటర్లలో బౌలింగ్ సామర్థ్యం కలిగిన ఆటగాళ్లు లేరు. దాంతోనే రియాన్ పరాగ్కు గంభీర్.. అవకాశం ఇచ్చాడు. తొలి టీ20లో 8 బంతులు మాత్రమే బౌలింగ్ చేసిన రియాన్ పరాగ్.. మూడు వికెట్లు తీసి గంభీర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. రెండో టీ20లో పూర్తిగా నాలుగు ఓవర్లను బౌలింగ్ చేశాడు.
రియాన్ పరాగ్కు మరిన్ని అవకాశాలు..
జట్టులో ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉంటే మేలు జరుగుతుందని గతంలో రోహిత్ పదే పదే చెప్పేవాడు. భారత్ గెలిచి 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజయాల్లో ఆల్రౌండర్గా యువరాజ్ సింగ్ పోషించిన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భవిష్యత్తులో రియాన్ పరాగ్ను కూడా మరో యువరాజ్ సింగ్లా మార్చాలనే లక్ష్యంతో గంభీర్ ముందుకు సాగుతున్నాడు.
గంభీర్ నిర్ణయాన్ని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా మెచ్చుకున్నాడు. రియాన్ పరాగ్కు మరిన్ని అవకాశాలు ఇవ్వడం సరైన నిర్ణయమని ట్వీట్ చేశాడు. రియాన్ పరాగ్ ఆల్రౌండర్గా రాణిస్తే హార్దిక్ పాండ్యాపై కూడా ఒత్తిడి తగ్గుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.