టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. శ్రీలంక పర్యటనతో తన బాధ్యతలను స్వీకరించనున్నాడు. మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం టీమిండియా.. శ్రీలంకకు వెళ్లనున్న విషయం తెలిసిందే. శనివారం(జూలై 27) జరిగే తొలి టీ20తో ఈ టూర్ మొదలవ్వనుంది.
ఈ పర్యటనకు వెళ్లే భారత జట్లను అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. అయితే హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. చివరకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అతనికి ఇవ్వలేదు. టీ20 ప్రపంచకప్ 2024లో హార్దిక్ పాండ్యా.. రోహిత్ శర్మకు డిప్యూటీగా కొనసాగాడు. అయితే హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ను పరిగణలోకి తీసుకునే అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.

టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. ఫిట్నెస్ నిరూపించుకునేందుకు హార్దిక్ పాండ్యాకు ఓ కండిషన్ పెట్టినట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి. హార్దిక్ పాండ్యాను కీలక పేస్ ఆల్రౌండర్గానే వాడుకోవాలనుకుంటున్నామని అతనికి వివరణ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా దేశవాళీ క్రికెట్ ఆడి ఫిట్నెస్ కూడా నిరూపించుకోవాలని హార్దిక్ను కోరినట్లు వార్తలు వస్తున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జట్టులో చోటు దక్కాలంటే విజయ్ హజారే ట్రోఫీలో బరోడా తరఫున 10 ఓవర్ల కోటా బౌలింగ్ చేయాలని హార్దిక్కు గంభీర్ సూచించాడట. 'టీమ్ ఎంపికకు ముందు హార్దిక్ పాండ్యాతో గౌతమ్ గంభీర్ ఫోన్లో మాట్లాడాడు. వన్డేల్లో పూర్తి కోటా ఓవర్లు బౌలింగ్ చేయాలని కోరుకుంటున్నట్లు హార్దిక్కు వివరించాడు.'అని బోర్డుకు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సన్నాహకాలను గౌతమ్ గంభీర్.. శ్రీలంక పర్యటనతోనే ప్రారంభించనున్నాడు. పాకిస్థాన్ వేదికగా ఈ టోర్నీ జరగనుండటంతో స్పిన్ ఆల్రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ను తీసుకోవాలనే యోచనలో గంభీర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా భాగం కావాలంటే అతను 10 ఓవర్ల కోటాను పూర్తి చేసే ఫిట్నెస్ సాధించాలి. హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా తెలుగు తేజం, 21 ఏళ్ల బౌలింగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని రెడీ చేయడంపై గంభీర్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

వ్యక్తిగత కారణాలతో శ్రీలంకతో వన్డే సిరీస్కు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఈ పర్యటనలోని వన్డే సిరీస్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం రోహిత్.. అమెరికాలో కుటుంబ సభ్యులతో సేద తీరుతుండగా.. విరాట్ కోహ్లీ లండన్లో తన కుటుంబ సభ్యులతో విశ్రాంతి సమయాన్ని గడుపుతున్నాడు.
టీమిండియా టీ20 జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్
టీమిండియా వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.