
బెంగళూరు: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఉన్న పిచ్చి అభిమానం నలుగురి కుర్రాళ్లను కటకటాల పాలు చేసింది. తమ అభిమాన క్రికెటర్తో సెల్ఫీలు దిగాలనే ఆరాటం వారి భవిష్యత్తును ఇరకాటంలో పడేసింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ రెండో రోజు ఆటలో ఓ నలుగురు కుర్రాళ్లు సెక్యురిటీ కళ్లు గప్పి మైదానంలోకి పరుగెత్తుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరూ విరాట్ కోహ్లీతో సెల్ఫీలు దిగగా.. మరో ఇద్దరినీ సెక్యూరిటీ సిబ్బంది లాక్కెళ్లారు.
రెండో రోజు ఆట మూడో సెషన్లో కోహ్లీ ఫస్ట్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తుండగా.. మైదానంలోకి వచ్చిన కుర్రాళ్లు కోహ్లీ వద్దకు వచ్చి సెల్ఫీలు తీసుకున్నారు. అయితే, విరాట్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా దూరంగా ఉన్నాడు. బయోబబుల్లో ఉన్నందున తనని ముట్టకుండా సెల్ఫీలు తీసుకోమని కోరాడు. దీంతో ఇద్దరు యువకులు కోహ్లీతో ఫొటోలు క్లిక్మనిపించారు. ఇక ఆ ఇద్దరిని ఏమనకుండా బయటకు తీసుకెళ్లాలని సెక్యురిటీ విరాట్ కోహ్లీ కోరాడు.
అయితే భద్రతా నిబంధనలను అతిక్రమించిన ఆ నలుగురు కుర్రాళ్లను గుర్తించిన బెంగళూరు పోలీసులు వారిపై కేస నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురిలో ఇద్దరూ మైనర్లు కావడం విశేషం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక పోలీసుల వివరాల ప్రకారం కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో వీరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. నలుగురిలో ఒకరు కలబురగి ప్రాంతానికి చెందినవాడు కాగా.. మిగిలిన ముగ్గురు బెంగళురు వాసులు.
ఈ మ్యాచ్లో భారత్ విజయానికి చేరువలో ఉంది. 447 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక మూడో రోజు ఆటలో 39 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లకు 151 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో కెప్టెన్ దిముత్ కరుణ రత్నే(67 బ్యాటింగ్), నిరోషన్ డిక్వెల్లా( 10 బ్యాటింగ్) ఉన్నారు. మరో 6 వికెట్లు తీస్తే భారత విజయం లాంఛనమవుతోంది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 92) మేటి ఇన్నింగ్స్ ఆడటంతో తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులు చేసింది. లంక బౌలర్లలో ఎంబుల్దేనియా (3/94), జయవిక్రమ (3/81), ధనంజయ డిసిల్వా (2/32) రాణించారు.
అనంతరం శ్రీలంక ఫస్ట్ ఇన్నింగ్స్లో 109 పరుగులకే కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా(5/24) ఐదు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు. దాంతో భారత్కు 143 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీకి తోడు శ్రేయస్ అయ్యర్ కూడా మరో హాఫ్ సెంచరీ బాదడంతో భారత్ 303/9 స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చింది.
సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్ 252 ఆలౌట్ (శ్రేయస్ అయ్యర్ 92)
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 109 ఆలౌట్ ( మాథ్యూస్ 43, బుమ్రా 5/24)
భారత్ రెండో ఇన్నింగ్స్ 17 ఓవర్లలో 59/1