
బెంగళూరు: శ్రీలంకతో జరుగుతున్న డే/నైట్ టెస్ట్లో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్(4)విచిత్రకర పరిస్థితుల్లో రనౌటయ్యాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకొని మయాంక్ అగర్వాల్తో ఇన్నింగ్స్ ప్రారంభించగా.. ఆరంభంలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. అయితే మయాంక్ ఔటైన తీరుపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ నడుస్తోంది. అసలు అతను ఔటా? నాటౌటా? అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తుండగా.. కొందరు క్రికెట్ ఎక్స్పర్ట్స్ మాత్రం నాటౌట్ అంటున్నారు.
అసలేం జరిగిందంటే..? ఇండియా ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే మయాంక్ అగర్వాల్ రనౌటయ్యాడు. విశ్వ ఫెర్నాండో వేసిన ఆ ఓవర్ నాలుగో బంతిని మయాంక్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేయగా.. బంతి బ్యాట్ను తాకుతూ ప్యాడ్లను తాకింది. దాంతో శ్రీలంక ఆటగాళ్లంతా ఎల్బీ కోసం బిగ్గరగా అప్పీల్ చేశారు. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో రివ్యూ కోరారు. మరోవైపు బ్యాట్ తాకిందంటూ రోహిత్కు సైగలు చేసిన మయాంక్ ... క్యాజువల్గా ముందుకు రాగా రోహిత్ రన్ కోసం మూమెంట్ ఇచ్చాడు. దాంతో మయాంక్ పరుగెత్తగా.. రోహిత్ యూటర్న్ తీసుకున్నాడు. అయినా వికెట్లను కొట్టని వికెట్ కీపర్.. ఎల్బీ కోసమే రివ్యూ సిగ్నల్ ఇచ్చాడు. సహచర ఆటగాళ్ల సూచనలతో తర్వాత స్టంప్స్ పడేసాడు.
అయితే అది నో బాల్ కావడంతో అంపైర్ రివ్యూను రద్దు చేసి రనౌట్ చెక్ చేసి మయాంక్ను ఔటిచ్చాడు. అయితే రివ్యూ కోరినప్పుడు బంతి డెడ్ బాల్ అవుతుందని, అప్పుడు రనౌట్ ఎలా ఇస్తారని నెటిజన్లు వాదిస్తున్నారు. కొందరు క్రికెట్ విశ్లేషకులు, కామెంటేటర్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ సైతం అంపైర్ను ఈ విషయంపైనే నిలదీసినట్లు టీవీ రిప్లేలో కనిపించింది. ఇక మయాంక్ అగర్వాల్ రనౌట్ అవ్వడానికి కారణం రోహిత్ శర్మనే అని కొంత మంది అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.
రోహిత్ శర్మ కారణంగా ఇప్పటికే చాలా మంది రనౌటయ్యారని, ఇప్పుడు మయాంక్ బలయ్యాడని కామెంట్ చేస్తున్నారు. అనవసరంగా పరుగు కోసం ప్రయత్నించి మయాంక్ను బలి తీసుకున్నాడని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. క్రీజులోకి హనుమ విహారి రాగా.. రోహిత్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు. 9 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 28 రన్స్ చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(15 బ్యాటింగ్), హనుమ విహారి(7 బ్యాటింగ్) ఉన్నారు.