సూర్యకు అవకాశం ఇవ్వరా..?
శ్రీలంకతో మూడో టీ20లో సెంచరీతో చెలరేగి ఒంటిచేత్తో విజయాన్ని అందించిన సూర్యకుమార్ యాదవ్ను బెంచ్పై కూర్చోబెట్టడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. తనకే సాధ్యమైన 360 ఆటతో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యను పక్కనపెట్టడం నమ్మశక్యంగా లేదని మండిపడుతున్నారు.
ఫ్యాన్స్తో పాటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సైతం టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. అసలు ఏ ఉద్దేశంతో టీమ్ సెలెక్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని, రెడ్ హాట్ ఫామ్లో ఉన్న ఆటగాళ్లను పక్కనపెట్టడం ఏం స్ట్రాటజీ అర్థం కావడం లేదంటున్నారు.
డబుల్ సెంచరీ చేసినా..
బంగ్లాదేశ్ పర్యటనలో ఓపెనర్గా బరిలోకి దిగి డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్కు టీమ్మేనేజ్మెంట్ మొండిచెయ్యే చూపించింది. శుభ్మన్ గిల్ను సాకుగా చూపిస్తూ ఇషాన్ కిషన్పై వేటు వేసింది. వాస్తవానికి కేఎల్ రాహుల్ కోసమే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్తో టీమిండియా ఓటములకు కారణమవుతున్న కేఎల్ రాహుల్కు అవకాశాలు ఇవ్వడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మలే.. కేఎల్ రాహుల్కు అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.
పాపం కుల్దీప్ యాదవ్..
వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. గతేడాది కాలంగా బెంచ్కే పరిమితం అవుతున్న ఈ మణికట్టు స్పిన్నర్.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా పట్టించుకోవడం లేదు. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పెర్ఫామెన్స్ ఇచ్చిన మరుసటి మ్యాచ్కే పక్కనపెట్టారు. తాజా మ్యాచ్కు పరిగణలోకి తీసుకోలేదు. డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్, సెంచరీతో సూపర్ ఫామ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, బంగ్లా పర్యటనలో సత్తా చాటిన కుల్దీప్ యాదవ్ను పక్కనపెట్టడం ఏంటో తమకు అర్థం కావడం లేదని, టీమిండియాను ఆ దేవుడే కాపాడాలని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పదే పదే జట్టును మార్చడంతో రెండు ప్రపంచకప్లు కోల్పోయినా బుద్ది రాలేదని ఘాటుగా విమర్శిస్తున్నారు.
భారత తుది జట్టు..
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్


Click it and Unblock the Notifications












