
ముంబై: శ్రీలంకతో తొలి టీ20లో మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ కనబర్చిన టీమిండియా ఆల్రౌండర్ దీపక్ హుడాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్లో సహనం కోల్పోయిన దీపక్ హుడా.. అంపైర్పై నోరు పారేసుకున్నాడు. అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. దీపక్ హుడాపై నెటిజన్లు మండిపడుతున్నారు. అంపైర్లను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. అంపైర్ల తప్పిదంతో సహనం కోల్పోవడం సహజమే అయినా.. అసభ్య పదజాలం ఉపయోగించడం సరికాదని, క్రికెట్ మ్యాచ్లను కోట్ల మంది వీక్షిస్తారనే సోయి ఉండాలని మండిపడుతున్నారు.
అసలేం జరిగిందంటే.. భారత ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కసున్ రజితా వేసిన ఈ ఓవర్ ఐదో బంతిని ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా వైడ్గా వెళ్లింది. అయితే దీపక్ హుడా ఆఫ్ స్టంప్స్ వైపు కదలడంతో అంపైర్ అనంత పద్మనాభన్ వైడ్ ఇవ్వలేదు. దాంతో అసహనానికి గురైన దీపక్ హుడా.. నీ అక్క... అంటూ హిందీ రాయలేని బూతు పదాన్ని ఉపయోగించాడు. ఇది కాస్త స్టంప్ మైక్లో రికార్డయ్యింది. తరువాతి బంతిని సింగిల్ దీసిన దీపక్ హుడా.. వైడ్ కోసం అంపైర్తో వాగ్వాదానికి కూడా దిగాడు.
94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోర్ దిశగా సాగుతున్న టీమిండియా ఇన్నింగ్స్కు దీపక్ హుడా తన విధ్వంసకర బ్యాటింగ్తో ఊపు తీసుకొచ్చాడు. అక్షర్ పటేల్ (20 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 31 నాటౌట్) జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. అక్షర్ పటేల్తో కలిసి చివరి 35 బంతుల్లో 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 23 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సర్లతో 41 పరుగులతో అజేయంగా నిలిచిన దీపక్ హుడా.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.

ఈ మ్యాచ్లో భారత్ 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షాన్, మహీశ్ తీక్షణ, చమిక కరుణరత్నే, ధనుంజ డిసిల్వా, వానిందు హసరంగా ఐదు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులకు కుప్పకూలింది. డసన్ షనక(27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 45), చమిక కరుణరత్నే(16 బంతుల్లో 2 సిక్సర్లతో 23 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో శివమ్ మావి నాలుగు వికెట్లు తీయగా.. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీసారు.