మిడిలార్డర్ వైఫల్యం కారణంగానే గెలవాల్సిన మ్యాచ్లో చిత్తుగా ఓడామని శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక అన్నాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్తో శనివారం జరిగిన తొలి మ్యాచ్లో శ్రీలంక 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో మూడు టీ20ల సిరీస్లో శ్రీలంక 0-1తో వెనుకంజలో నిలిచింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. రిషభ్ పంత్(33 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 49), యశస్వి జైస్వాల్(21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 40), శుభ్మన్ గిల్(16 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 34) ధాటిగా ఆడారు.

శ్రీలంక బౌలర్లలో మతీష పతీరణ(4/40) నాలుగు వికెట్లు తీయగా.. దిల్షాన్ మదుషంక, అసిత ఫెర్నాండో, వానిందు హసరంగా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకు కుప్పకూలి ఓటమిపాలైంది. పాతుమ్ నిస్సంక(48 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 79), కుశాల్ మెండీస్(27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 45) రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
భారత బౌలర్లలో రియాన్ పరాగ్(3/5) మూడు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్ తలో వికెట్ తీసారు. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక ఓపెనర్లు అద్భుత ప్రదర్శన చేసినా మిగతా బ్యాటర్లు ఆ జోరు కొనసాగించలేకపోయారని చెప్పాడు. మిడిలార్డర్ వైఫల్యం తమ పతనాన్ని శాసించిందన్నాడు.
'మేం మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. బౌలింగ్లో వపర్ ప్లేలో ధారళంగా పరుగులిచ్చుకున్నాం. కానీ ఆ తర్వాత తిరిగి పుంజుకొని కట్టడిగా బౌలింగ్ చేశాం. ఓ దశలో భారత్ సునాయసంగా 240 పరుగులు చేసేలా కనిపించింది. కానీ మేం అద్భుతంగా పుంజుకొని భారీ స్కోర్ను అడ్డుకున్నాం. మా మిడిలార్డర్ బ్యాటర్లు ఆడిన తీరు తీవ్రంగా నిరాశపరిచింది.
మేం మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ఆరుగురు బ్యాటర్లు, ఐదు గురు బౌలర్ల కాంబినేషన్తో బరిలోకి దిగడం ఓ ప్రయోగం. భవిష్యత్తులో ఈ కాంబినేషన్నే కొనసాగిస్తాం'అని చరిత్ అసలంక చెప్పుకొచ్చాడు.