శ్రీలంక పర్యటనకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత కారణాలతో శ్రీలంకతో వన్డే సిరీస్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి హార్దిక్ పాండ్యా తెలియజేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. బీసీసీఐ కూడా హార్దిక్ పాండ్యాకు అనుమతిచ్చినట్లు తెలుస్తోంది.
గాయంతో వన్డే ప్రపంచకప్ 2023 మధ్యలోనే జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా.. అప్పటి నుంచి మళ్లీ వన్డే ఫార్మాట్ ఆడలేదు. వన్డే సిరీస్కు దూరమైన శ్రీలంకతో టీ20 సిరీస్కు హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉంటాడని ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది.

మరోవైపు ఈ పర్యటనకు విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా దూరంగా ఉండే అవకాశం ఉంది. దాంతో భారత జట్టును కేఎల్ రాహుల్ నడిపించే ఛాన్స్ ఉంది. గౌతమ్ గంభీర్ ఈ పర్యటనతోనే టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అతను ఈ పర్యటనకు పూర్తి స్థాయి జట్టు అందుబాటులో ఉండాలని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలను ఈ పర్యటనకు ఎంపిక చేయాలని బీసీసీఐని కోరినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఎక్కువగా సమయం లేకపోవడం.. సన్నాహకానికి కావాల్సిన వన్డే సిరీస్లు కూడా షెడ్యూల్ చేయకపోవడంతో ఈ పర్యటన నుంచే ప్రిపరేషన్స్ మొదలుపెట్టాలని గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గంభీర్ మంగళవారం భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్తో సమావేశమవుతాడని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఈ పర్యటనలో భారత్ 3 వన్డేలు, 3 టీ20లు ఆతిథ్య శ్రీలంకతో ఆడనుంది. ఈ రెండు ఫార్మాట్లకు సంబంధించిన జట్లను బీసీసీఐ మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది.