
బెంగళూరు: అమ్మ.. ఆవకాయ.. విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ ఎప్పటికీ మరిచిపోలేం. శ్రీలంకతో బెంగళూరు వేదికగా జరుగుతున్న డే/నైట్ టెస్ట్లో విరాట్ కోహ్లీ అద్భుత కవర్ డ్రైవ్ ఆడాడు. బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉన్న వికెట్పై తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. స్పిన్ బౌలింగ్లో కొంత తడబడ్డా ఓపికగా ఆడుతూ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. ఇక ఎంబుల్దేనియా బౌలింగ్లో విరాట్ కొట్టిన కవర్ డ్రైవ్కు అభిమానులు ఫిదా అవుతున్నారు.
స్పిన్కు అనుకూలంగా మారిన పిచ్పై విరాట్ కొట్టిన ఈ షాట్ చూడమచ్చటగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కామెంటేటర్లు సైతం ఈ షాట్ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ ఒక్క ఫోర్ కోహ్లీ మీదున్న ఒత్తిడిని తగ్గించిందని పేర్కొన్నారు.
ఐపీఎల్లో గత 14 ఏళ్లుగా ఆర్సీబీ టీమ్కు ఆడుతున్న కోహ్లీకి బెంగళూరు హోమ్ గ్రౌండ్ లాంటిది. ఈ మ్యాచ్కు 100 శాతం అభిమానులను అనుమతివ్వడంతో మైదానం ప్రేక్షకులతో కిక్కిరీసింది. మ్యాచ్ను చూసేందుకు కోహ్లీ అభిమానులు ఎగబడ్డారు. కోహ్లీ ప్లకార్డులు, ఫొటోలతో మైదానంలో సందడి చేస్తున్నారు. కోహ్లీ మైదానంలోకి వచ్చే సమయంలో క్రౌడంతా కోహ్లీ నామస్మరణ చేసింది. బెంగళూరు మైదానం మొత్తం కోహ్లీ, ఆర్సీబీ నామస్మరణతో దద్దరిల్లుతోంది.
ఓ అభిమాని అయితే కోహ్లీ సెంచరీ చేసే వరకు పెళ్లి చేసుకోనని ప్లకార్డు ప్రదర్శించాడు. ఇక పాకిస్థాన్లో సైతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ హాజరైన అక్కడి కోహ్లీ అభిమానులు.. అతని ప్లకార్డులు ప్రదర్శించారు. సెంచరీ చేసినా.. చేయకున్నా ఎప్పటికీ తమ హీరో కోహ్లీనే అని పేర్కొన్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(4), రోహిత్ శర్మ(15)మరోసారి దారుణంగా విఫలమయ్యారు. విచిత్రకర పరిస్థితుల్లో మయాంక్ నోబాల్కు రనౌటవ్వగా.. రోహిత్ స్లిప్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హనుమ విహారి(31), విరాట్ కోహ్లీ(23) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. జయవిక్రమార్క, ధనుంజయ డిసిల్వా దెబ్బకొట్టారు.
విహారీని విక్రమార్క ఔట్ చేయగా.. కోహ్లీని డిసిల్వా ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ 86 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.