మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డేలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్, శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండీస్ గొడవపడ్డారు. మైదానంలోనే ఒకరిపై ఒకరు నోరుపారేసుకున్నారు. ముందుగా సిరాజ్ తన మాటలతో కుశాల్ మెండీస్ను కవ్వించగా.. అతను ధీటుగా బదులిచ్చాడు. దాంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
శ్రీలంక ఇన్నింగ్స్ 37వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని సిరాజ్.. ఆఫ్ సైడ్ కాస్త లోగా వేయగా.. కుశాల్ మెండీస్ డిఫెన్స్ చేశాడు. బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లగా.. కాస్త ముందుకు వెళ్లిన సిరాజ్.. బ్యాటర్ను ఏమో అన్నాడు. సిరాజ్ మాటలతో ఆగ్రహానికి గురైన కుశాల్ మెండీస్ ధీటుగా బదులిచ్చాడు. ఇద్దరు ఒకరికొకరు సవాళ్లు విసిరుకున్నట్లు అనిపించింది.

ఈ మ్యాచ్లో సిరాజ్ బౌలింగ్ ఆడేందుకు కుశాల్ మెండీస్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. పూర్తిగా డిఫెన్స్కే పరిమితమయ్యాడు. దాంతో ఆగ్రహానికి గురైన సిరాజ్.. కుశాల్ మెండీస్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు చేసింది. అవిష్కా ఫెర్నాండో(102 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 96) తృటిలో శతకాన్ని చేజార్చుకోగా.. కుశాల్ మెండీస్(82 బంతుల్లో 4 ఫోర్లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ పాతుమ్ నిస్సంక(65 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
భారత బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు వికెట్లు తీయగా. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్లు తలో వికెట్ తీసారు.