
కొలంబో: భారత్తో జరుగుతున్న తొలి టీ20లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా ఊహించనట్లుగానే ఈ మ్యాచ్ ద్వారా భారత యువ ఆటగాళ్లు పృథ్వీ షా, వరుణ్ చక్రవర్తీ అంతర్జాతీయ టీ20 క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీకి గతంలో రెండు సార్లు అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. కానీ ఈ సారి ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. శ్రీలంక జట్టులో కూడా ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. అయితే వారిపేర్లను శ్రీలంక కెప్టెన్ డసన్ షనక మరిచిపోవడం గమనార్హం. అయితే అసలంక, కరుణరత్నే ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్ తమకు ఎంతో ముఖ్యమని షనక తెలిపాడు. ఈ వికెట్కు చేజింగ్కు అనుకూలంగా ఉంటుందని, అందుకే ఫీల్డింగ్ తీసుకుంటున్నానని స్పష్టం చేశాడు. తమ జట్టులో మొత్తం మూడు మార్పులు చోటు చేసుకున్నాయని, ఇసురు ఉడానా జట్టులో రాగా.. మరో ఇద్దరు అరంగేట్రం చేస్తున్నారని తెలిపాడు. ఇక టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ తీసుకునేవాళ్లమని, పిచ్ అలాంటిదని ధావన్ తెలిపాడు. తమ జట్టులో కూడా భారీ మార్పులు చోటు చేసుకున్నాయని, షా, వరుణ్ చక్రవర్తీ అరంగేట్రం చేస్తున్నారని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకునే యువ ఆటగాళ్లు అవకాశాలు ఇస్తున్నామని తెలిపాడు.
ముందుగా ఊహించినట్లుగానే వన్డే సిరీస్లో విఫలమైన మనీశ్ పాండేపై వేటు పడింది. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఇద్దరు జట్టులోకి వచ్చారు. భువీ, దీపక్ చాహర్, కృనాల్ పాండ్యా సైతం జట్టులోకి తిరిగి వచ్చారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్కు అవకాశం దక్కింది. మూడు వన్డేల సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న గబ్బర్ సేన టీ20 సిరీస్ను గెలుచుకోవాలని భావిస్తోంది. తొలి రెండు మ్యాచ్లను గెలిచి ఆఖరి టీ20లో ప్రయోగాలకు తెరలేపాలని భావిస్తోంది. మరోవైపు శ్రీలంక మాత్రం టీ20 సిరీస్ గెలిచి వన్డే సిరీస్ ఓటమికి బదులు తీర్చుకోవాలనుకుంటుంది. ఇరు జట్ల ముఖా ముఖి రికార్డులో భారత్దే పై చేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటి వరకు 19 మ్యాచ్లు ఆడగా.. భారత్ 13, శ్రీలంక 5 గెలిచింది. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు.
తుది జట్లు
భారత్: పృథ్వీ షా, శిఖర్ ధావన్(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తీ, యుజ్వేంద్ర చాహల్
శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్ బానుక, ధనుంజయ, అసలంక, డసన్ షనక(కెప్టెన్), బండారా, వానిందు హసరంగా, చమిక కరుణరత్నే, ఇసురు ఉడానా, అకిలా ధనుంజయ, దుష్మంత్ చమీరా