
న్యూఢిల్లీ: సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. జనవరి 19 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డే సిరీస్కు స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ సేవలను కోల్పోయే అవకాశం ఉంది. ఈ తమిళనాడు క్రికెటర్కు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సుందర్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. బీసీసీఐ అధికారులు దృవీకరించారు. ఇక వాషింగ్టన్ సుందర్ దూరమైతే టీమిండియాకు కష్టాలు తప్పవు.
ఇప్పటికే గాయాలతో స్టార్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలు సౌతాఫ్రికా పర్యటనకు దూరమయ్యారు. ఇక కరోనా సోకిన విషయంపై స్పందించేందుకు సుందర్ నిరాకరించాడు. ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్బజ్.. వైరస్ సోకడంపై వివరణ కోరగా అతను సమాధానం చెప్పకుండా దాటవేసాడు. 'ఎలాంటి కామెంట్ చేయదల్చుకోలేదు. త్వరలోనే జట్టుతో చేరుతా'అని బదులిచ్చాడు. ఇంగ్లండ్ పర్యటనలో ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడ్డ సుందర్.. ఐపీఎల్ 2021 సెకండాఫ్కు దూరమయ్యాడు.
ఆ తర్వాత గాయం నుంచి కోలుకున్నా ఫిట్నెస్ సంబంధిత సమస్యలతో టీ20 ప్రపంచకప్లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇటీవల పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించిన అతను దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపాడు. తమిళనాడు తరఫున విజయ్ హజారే ట్రోఫీలో సత్తా చాటాడు. దాంతో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు. కానీ అంతలోనే అతన్ని కరోనా కాటు వేసింది. దాంతో మళ్లీ టీమ్కు దూరమయ్యే అవకాశం ఉంది. ఇక సుందర్కు కరోనా సోకిన విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి దృవీకరించారు. 'కొద్ది రోజుల క్రితమే సుందర్ కరోనా పాజిటీవ్గా తెలాడు. దాంతోనే అతను సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లడం లేదు.'అని సదరు అధికారి క్రిక్బజ్తో అన్నాడు.
ఇక తొడ కండరాల గాయంతో రోహిత్ శర్మ సౌతాఫ్రికా పర్యటనకు పూర్తిగా దూరమవడంతో.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. వన్డే సిరీస్లో టీమిండియాను నడిపించనున్నాడు. ఇక ఈ వన్డే సిరీస్కు 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
భారత జట్టు:
కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్