IND vs SA Warm-Up: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ నేపథ్యంలో సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక సన్నాహక మ్యాచ్లో టీమిండియా 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇషాన్ కిషన్ విధ్వంసంకర బ్యాటింగ్తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అదిరిపోయే బౌలింగ్ ప్లాన్తో అద్భుత విజయాన్నందుకుంది. ఈ సన్నాహక మ్యాచ్లో భారత్ 9 మందితో బౌలింగ్ చేయించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మినహా జట్టులో ఉన్న ఆటగాళ్లంతా బౌలింగ్ చేశారు.
నవీ ముంబై వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. తమ ఓపెనర్ ఎవరనే చర్చకు ముగింపు పలికింది. సంజూ శాంసన్ స్థానంలో ఇషాన్ కిషన్ను ఓపెనర్గా ఆడించింది. అతను తొలి బంతి నుంచే సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా అన్రిచ్ నోకియా వేసిన ఐదో ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో 29 పరుగులు పిండుకున్నాడు.

కేవలం 20 బంతుల్లోనే 7 సిక్సర్లు, 2 బౌండరీలతో 53 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. ఇతర ఆటగాళ్లకు బ్యాటింగ్ అవకాశం ఇచ్చేందుకు రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ దూకుడా ఆడి భారత జట్టుకు 240 పరుగుల భారీ స్కోర్ అందించారు.
భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంకకు ఆశించిన ఆరంభం లేదు. వికెట్ కీపర్ ర్యాన్ రికెల్టన్(44), కెప్టెన్ మార్క్రమ్(38), స్మిత్(35), ట్రిస్టెన్ స్టబ్స్(45) దూకుడుగా ఆడారు. అయినా ఆ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ మొత్తం 9 మంది బౌలర్లను ఉపయోగించాడు. కెప్టెన్, వికెట్ కీపర్ తప్పా మైదానంలో ఉన్న తొమ్మిది మంది ఆటగాళ్లు బౌలింగ్ చేశారు.
అభిషేక్ శర్మ 3 ఓవర్లు వేసి(2/32) రెండు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ 2 ఓవర్లలో (1/12) ఒక వికెట్ పడగొట్టాడు. అక్షర్ పటేల్ ఒకే ఓవర్లో (1/2) ఒక వికెట్ తీయగా.. అర్ష్దీప్ సింగ్ నాలుగు ఓవర్లలో (1/29) ఒక వికెట్ పడగొట్టాడు. శివమ్ దూబే 4 ఓవర్లు వేసి (1/57) ఒక వికెట్ పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా 2 ఓవర్లు, హర్షిత్ రాణా ఒక ఓవర్, కుల్దీప్ యాదవ్ 2 ఓవర్లు, తిలక్ వర్మ ఒక ఓవర్ వేసినా వికెట్ తీయలేకపోయారు.
టీ20 ప్రపంచకప్ 2026 ముందు బ్యాటింగ్లో 240 పరుగులు భారీ స్కోర్.. బౌలింగ్లో కీలక బౌలర్ల అద్భుతమైన ప్రదర్శన భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసాయి. ముఖ్యంగా ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్ భారత జట్టు టాపార్డర్ బ్యాటింగ్ను మరింత బలోపేత చేసింది. సంజూ శాంసన్, బుమ్రా వంటి వారు ఆడకుండానే భారత్ భారీ విజయాన్ని సాధించడం గమనార్హం. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా శనివారం జరిగే తొలి మ్యాచ్లో అమెరికాతో టీమిండియా తలపడనుంది.