IND vs SA: టీమిండియా దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తన రియల్ హీరోనని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఆయన ఆటను టీవీల్లో చూస్తూ పెరిగానన్నాడు. సచిన్ రికార్డు సమం చేస్తానని కలలో కూడా ఊహించలేదని, ఆయన నుంచి ప్రశంసలు రావడం తనకు చాలా ప్రత్యేకమని తెలిపాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ అజేయ శతకంతో చెలరేగాడు. దాంతో వన్డే క్రికెట్లో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు. 452 ఇన్నింగ్స్ల్లో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలు బాదగా.. విరాట్ కోహ్లీ 277 ఇన్నింగ్స్ల్లోనే పూర్తి చేశాడు. తన 35వ జన్మదినం రోజునే ఈ రికార్డు అందుకున్న కోహ్లీ.. బర్త్డేను మరింత స్పెషల్గా మలుచుకున్నాడు..

కోహ్లీ శతకానికి జడేజా సంచలన ప్రదర్శన తోడవడంతో ఈ మ్యాచ్లో టీమిండియా 243 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు స్వీకరించిన అనంతరం మాట్లాడిన కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సచిన్ రికార్డు సమం చేయడంతో పాటు ఆయన నుంచి వచ్చిన ప్రశంసలపై సంతోషం వ్యక్తం చేశాడు.
'సచిన్ టెండూల్కర్ నా ఆరాథ్య దైవం. నా హీరో రికార్డును సమం చేయడం నాకు చాలా స్పెషల్. బ్యాటింగ్లో సచిన్ పర్ఫెక్ట్. ఇది నాకు ఎమోషనల్ మూమెంట్. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు బాగా తెలుసు. నేను టీవీల్లో సచిన్ ఆటను చూస్తూ ఎదిగిన రోజులు నాకింకా గుర్తున్నాయి. ఆయన నుంచి ప్రశంసలు పొందడం నిజంగా నాకు చాలా ప్రత్యేకం.'అని కోహ్లీ తెలిపాడు.
మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. 'ఇది చాలా కీలకమైన మ్యాచ్. టోర్నమెంట్లోనే పటిష్టమైన ప్రత్యర్థితో తలపడ్డాం. అదే మా అందరిలో కసిని పెంచింది. నా పుట్టిన రోజు కావడంతో ఈ మ్యాచ్ ప్రత్యేకంగా మారిపోయింది. ప్రేక్షకులు కూడా దీనిని నాకెంతో ప్రత్యేకమైన మ్యాచ్గా మార్చేశారు. ఈ రోజు ఉదయం నేను ఓ సరికొత్త ఉత్సాహంతో నిద్రలేచాను.
మామూలు మ్యాచ్లాగా నేను దీన్ని భావించలేదు. ప్రేక్షకులు, అభిమానులు ఈ మ్యాచ్ను ఏ కోణంలో చూస్తారో నేను బాగా అర్థం చేసుకున్నా. ఈ మ్యాచ్లో ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. మిగతా బ్యాటర్లు మేం ఆ జోరును కొనసాగించాం. పవర్ ప్లే అనంతరం పిచ్ చాలా స్లోగా మారింది. స్పిన్ బౌలింగ్ ఆడటం కష్టంగా మారింది.
మ్యాచ్ ఆఖరి వరకూ క్రీజులో ఉండాలంటూ టీమ్మేనేజ్మెంట్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. ఒక్కసారి స్కోరు 315 పరుగులు చేరుకున్నాక.. మ్యాచ్లో మేము పైచేయి సాధించామనే విషయం అర్థమైంది. క్రికెట్ను నేను బాగా ఆస్వాదిస్తున్నాను. నాకు సహకరిస్తున్న ఆ దేవుడికి కృతజ్ఞతలు.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.