సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దుమ్మురేపారు. తమ బ్యాటింగ్తోనే విమర్శకుల నోరు మూయించారు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో సత్తా చాటితే.. విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్కు 136 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సీనియర్ ఆటగాళ్ల సూపర్ బ్యాటింగ్కు యువ బౌలర్ల అద్భుత ప్రదర్శన తోడవ్వడంతో ఈ మ్యాచ్లో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ విజయానంతరం విరాట్ కోహ్లీ సోదరి భావన కోహ్లీ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫొటోను పంచుకున్న భావన కోహ్లీ.. క్యాప్షన్గా 'IYKYK' అని పేర్కొంది. తెలిసిన వారికి మాత్రమే అనే అర్థంలో ఈ పదాన్ని సోషల్ మీడియాలో ఉపయోగిస్తుంటారు. దాంతో గంభీర్ను ఉద్దేశించే భావన కోహ్లీ ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

కోహ్లీ, రోహిత్ ఆట గురించి గంభీర్కు అర్థమైందా? అని నేరుగా ప్రశ్నించకుండా ఇలా కోడ్ లాంగ్వేజ్లో పోస్ట్ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 'ఈ రెండు సింహాలు జట్టులో ఉంటే ఏం జరుగుతుందో అర్థం చేసుకున్న వారికి తెలుసు. వారి గురించి తప్పుడు విమర్శలు చేసేవారికి ఇదే సమాధానం'అని భావన విమర్శకులకు చురకలంటించిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
టెస్ట్, టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే వారి వయసు, ఫామ్ నేపథ్యంలో ప్రపంచకప్ ఆడుతారా? అని విమర్శలకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందేహాలకు రోహిత్, కోహ్లీ బ్యాట్తోనే బదులిచ్చారు.
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ పరాజయం అనంతరం విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ చేసిన పోస్ట్ కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. 'ఆధిపత్యం చెలాయించాలనే చూస్తే ఇలానే జరుగుతుంది.'అని ఆయన పోస్ట్ చేయగా.. గంభీర్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. తాజాగా సోదరి భావన కూడా సోషల్ మీడియా వేదికగా కోహ్లీకి మద్దతుగా పోస్ట్లు పెడుతుండటంతో అతని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మైదానంలో కోహ్లీ దుమ్మురేపుతుంటే.. అతని కుటుంబం సోషల్ మీడియాలో అలజడి సృష్టిస్తోందని, విమర్శకులకు చావుదెబ్బ అని కామెంట్ చేస్తున్నారు.