టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన చర్యతో అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. సౌతాఫ్రికాతో కేప్టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో కోహ్లీ చేసిన పని చర్చనీయాంశమైంది. సౌతాఫ్రికా తాత్కలిక సారథి డీన్ ఎల్గర్కు ఇదే చివరి మ్యాచ్. ఈ సిరీస్కు ముందే అతను తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. భారత్తో జరిగే రెండు టెస్ట్ల సిరీస్తో సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు.
తన ఫేర్వేల్ సిరీస్లో తొలి టెస్ట్లో సెంచరీతో జట్టుకు భారీ విజయాన్ని అందించిన డీన్ ఎల్గర్.. రెండో టెస్ట్లో మాత్రం ఆ జోరు చూపించలేకపోయాడు. పేస్కు అనుకూలంగా ఉన్న పిచ్పై బౌలర్లు నిప్పులు చెరగడంతో దారుణంగా విఫలమయ్యారు. ఒకే రోజు రెండు ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసి విఫలమయ్యాడు.

తొలి ఇన్నింగ్స్లో 4 పరుగులు చేసిన డీన్ ఎల్గర్.. రెండో ఇన్నింగ్స్లో 12 పరుగులే చేశాడు. రెండో ఇన్నింగ్స్లో ముఖేష్ కుమార్ బౌలింగ్లో స్లిప్ ఫీల్డర్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి డీన్ ఎల్గర్ వెనుదిరిగాడు. ఈ క్యాచ్ అందుకున్న కోహ్లీ.. వెంటనే డీన్ ఎల్గర్ దగ్గరకు వెళ్లి అతన్ని హగ్ చేసుకొని మరీ అభినందించాడు.
అంతేకాకుండా స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని ప్రేక్షకులకు సూచించాడు. ఇక అభిమానులు, ఆటగాళ్ల కరతాళ ధ్వనుల మధ్య డీన్ ఎల్గర్.. మైదానం వీడాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోతో పాటు డీన్ ఎల్గర్ను కోహ్లీ హగ్ చేసుకున్న ఫొటో నెట్టింట వైరల్గా మారింది. పిక్ ఆఫ్ ది డే అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
95 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 62 పరుగులు చేసింది. క్రీజులో ఎయిడెన్ మార్క్రమ్(36 బ్యాటింగ్)తో పాటు డేవిడ్ బెడ్డింగ్హమ్(7 బ్యాటింగ్) ఉన్నారు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్(2/25) రెండు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా(1/25) ఒక వికెట్ పడగొట్టాడు. సౌతాఫ్రికా ఇంకా 36 పరుగుల వెనుకంజలో ఉంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 23.2 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ సిరాజ్(6/15) ఆరు వికెట్లతో సఫారీ టీమ్ పతనాన్ని శాసించగా... జస్ప్రీత్ బుమ్రా(2/25), ముఖేష్ కుమార్(2/0) రెండేసి వికెట్లతో రాణించారు.
అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకు కుప్పకూలింది. ఓ దశలో 153/4 స్కోర్తో పటిష్టంగా కనిపించిన టీమిండియా.. అనంతరం 11 బంతుల వ్యవధిలో ఒక్క పరుగు కూడా జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోయింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 46), శుభ్మన్ గిల్(55 బంతుల్లో 5 ఫోర్లతో 36), రోహిత్ శర్మ(50 బంతుల్లో 7 ఫోర్లతో 39)మాత్రమే రాణించారు. సఫారీ బౌలర్లలో కగిసో రబడా(3/38), లుంగి ఎంగిడి(3/30), నండ్రే బర్గర్(3/42) మూడేసి వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు.