IND vs SA: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్లో విరాట్ కోహ్లీ(121 బంతుల్లో 10 ఫోర్లతో 101 నాటౌట్) రికార్డు సెంచరీతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 40), రవీంద్ర జడేజా(15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 29 నాటౌట్) మెరుపులు మెరిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్, కగిసో రబడా, కేశవ్ మహరాజ్, టబ్రైజ్ షంసీ, ఎయిడెన్ మార్క్రమ్ తలో వికెట్ తీసారు.

అదిరిపోయే ఆరంభం..:టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్ నుంచే సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో 4.3 ఓవర్లలోనే టీమిండియా 50 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీకి చేరువైన రోహిత్ శర్మ(40)ను రబడా పెవిలియన్ చేర్చాడు.
దాంతో తొలి వికెట్కు నమోదైన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి విరాట్ కోహ్లీ రాగా.. పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే టెంబా బవుమా స్పిన్నర్ అయిన కేశవ మహరాజ్ను బరిలోకి దింపి ఫలితాన్ని రాబట్టాడు. అతను వేసిన మూడో బంతికి శుభ్మన్ గిల్(23) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
చెలరేగిన అయ్యర్, కోహ్లీ:క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కాస్త టైమ్ తీసుకున్న ఈ జోడీ అనంతరం స్వేచ్చగా బౌండరీలు బాదింది. ఈ క్రమంలో ముందుగా కోహ్లీ 67 బంతుల్లో.. తర్వాత శ్రేయస్ అయ్యర్ 64 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అనంతరం కాస్త దూకుడు కనబర్చిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది.
ప్రమాదకరంగా మారిన ఈ జోడీని లుంగి ఎంగిడి విడదీసాడు. శ్రేయస్ అయ్యర్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(8) తీవ్రంగా నిరాశపరిచాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అనంతరం దూకుడుగా ఆడిన సూర్యకుమార్ యాదవ్(22) చెత్త షాట్తో పెవిలియన్ చేరాడు.
క్రీజులోకి వచ్చిన జడేజా సాయంతో 119 బంతుల్లో కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. ఈ టోర్నీలో కోహ్లీకి ఇది రెండో సెంచరీ కాగా.. ఓవరాల్గా 49వ వన్డే సెంచరీ. వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన సచిన్ టెండూల్కర్ రికార్డ్ను కోహ్లీ సమం చేశాడు. ఇక జడేజా సైతం బౌండరీలు బాదడంతో టీమిండియా 326 పరుగులు చేసింది.